జననేత కేసీఆర్కు ఓరుగల్లు జనం బ్రహ్మరథం పట్టారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఆదివారం రాత్రి బస్సుయాత్ర ద్వారా చేరుకున్న బీఆర్ఎస్ అధినేతకు అడుగడుగునా నీరాజనం పలికారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి హనుమకొండ చౌరస్తాకు చేరుకున్న కేసీఆర్కు బోనాలు, మంగళహారతులతో మహిళలు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కేసీఆర్ను చూసేందుకు, ఆయన ప్రసంగం వినేందుకు వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ఉప్పెనలా కదిలొచ్చారు.
నగరంలో అడుగుపెట్టినప్పటి నుంచి కిలోమీటర్ల దూరం వెంట వచ్చిన జనంతో ఆ ప్రాంతమంతా గులాబీ వనంలా మారింది. మాట్లాడుతున్నంత సేపు ఆసక్తిగా విన్న ప్రజలు, వారి కెమెరా కళ్లన్నీ కేసీఆర్ వైపు చూస్తుండగా జై కేసీఆర్, జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను తూర్పార పట్టినప్పుడు ఈలలు, చప్పట్లు కొట్టి ప్రతిస్పందించారు. రాత్రి 7.37 నుంచి రాత్రి 8.25 గంటల వరకు ఉత్సాహంగా సాగిన కేసీఆర్ రోడ్ షో అశేష జనం తరలిరావడంతో గ్రాండ్ సక్సెస్ అయ్యింది. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని పెంచింది.