Medak | నర్సాపూర్, ఏప్రిల్ 28: నీళ్లులేక ఎండుతున్న పంటను చూసి తట్టుకోలేకపోతున్నానని ఉపాధి హామీ ఏపీవో సోషల్ మీడియా వేదికగా తన ఆవేదన వ్యక్తంచేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్లోని ఉపాధి హామీ కార్యాలయంలో ఏపీవోగా పనిచేస్తున్న శివ్వంపేట మండలం చండీ గ్రామానికి చెందిన అంజిరెడ్డి పంటల దుస్థితిపై కలత చెందారు. కరెంట్ సరిగ్గా రాకపోవడంతో తాను వేసిన పంట ఎండిపోతున్నదని ఆదివారం వాట్సాప్లో తన ఆవేదనను వ్యక్తపరిచారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 24 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ.. కేవలం 15 గంటలు మాత్రమే ఇస్తుండటంతో తన పొలం ఎండిపోతున్నదని చెప్పుకొచ్చారు. దయచేసి 24 గంటల కరెంట్ మరో పది రోజులు ఇవ్వాలని, ఒకవేళ ప్రభుత్వం దగ్గర కరెంట్ కొనడానికి డబ్బులు లేకపోతే కనీసం 20 గంటలైనా ఇవ్వాలని కోరారు.
సబ్స్టేషన్కు ఎన్నిసార్లు ఫోన్చేసినా.. ‘పైనుంచి త్రీ ఫేజ్ వేయమంటేనే వేస్తాం. ఇంకా ఎలాంటి మెసేజ్ రాలేదు’ అని విద్యుత్తు అధికారులు చెబుతున్నారని వెల్లడించారు. ఇంతకు ముందున్న విద్యుత్తు అధికారి స్పందించే వారని, ఇప్పుడున్న ఏఈకి ఎప్పుడు ఫోన్చేసినా అందుబాటులోకి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా 24 గంటల కరెంట్ సరఫరా చేసి పంటలను గట్టెక్కించాలని కోరారు.