Eye Diseases | హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ) : వారసత్వంగా వచ్చే రెటీనా వ్యాధులను గుర్తించేందుకు రెటీనాల్ పిగ్మెంట్ ఈపీథీలియం(ఆర్పీఈ)65లోని ఉత్పరివర్తనాలు ఎంతగానో సహకరిస్తాయని ఎల్వీ ప్రసాద్ కంటి అధ్యయన సంస్థ పరిశోధనలో తేలింది. కంటి వైద్య నిపుణులు చిత్ర కన్నబీరన్, దీపికాపరమేశ్వరప్ప, దీపక్ బగ్గా రెటీనా వ్యాధులపై అధ్యయనం చేశారు.
ఈ పరిశోధనల్లో అరుదైన, వశంపారంపర్యంగా వచ్చే కంటి వ్యాధుల్లో రెటీనా పిగ్మెంట్ ఈపీథీలియం వ్యవస్థ దెబ్బతినడం వలన తీవ్రమైన దృష్టి లోపాలు వస్తాయని, బాల్యంలోనే రెటీనాలోని ఉత్పరివర్తనాల లోపాలు సర్వసాధారణంగా ఉన్నాయని గుర్తించారు.
కంటిపై పడిన కాంతిని జీవరసాయన ప్రక్రియ ద్వారా విద్యుత్ సంకేతాలుగా మార్చి మెదడకు అందజేసే ప్రక్రియలో కొన్ని లోపాలు జన్యుపరమైన సమస్యలకు కారణం అవుతాయని తేల్చారు. ఎల్వీపీఈ వైద్యుల పరిశోధన జర్నల్ ఆప్తాల్మిక్ జెనెటిక్స్లో ప్రచురితమైంది. ఈ అధ్యయనానికి వారసత్వంగా కంటి సమస్యలున్న 260 మంది జన్యువులతో సీక్వెన్సింగ్ చేయడం వలన రెటీనాల్ పిగ్మెంట్ ఈపీథీలీయం లోపాలను గుర్తించినట్లుగా తేల్చారు. చిన్న వయసులోనే ఈ లోపాలను గుర్తిస్తే సవరించే అవకాశం ఉంటదని వెల్లడించారు.