రైతన్నల వినూత్న పంథా
విభిన్న రకాల పంటలతో ముందుకు
ఉత్పత్తులు పెరిగే విత్తన రకాల సాగు
ప్రత్యేకంగా ఎర్రబెండ, విత్తన వంకాయ, బ్లాక్ రైస్
కొత్త పద్ధతులతో లాభాలు గడిస్తున్న అన్నదాతలు
వరంగల్, జూలై 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వ్యవసాయం.. ఓ జీవన విధానం. రైతును, మట్టిని కలిపి అల్లుకున్న అనుబంధం. ఈ బంధాన్నే కొందరు రైతులు మరింత అద్భుతంగా మార్చుకుంటున్నారు. మూస విధానంకన్నా వినూత్నంగా పంటలు పండిస్తేనే మంచి ఫలితముంటుందని పలువురు అన్నదాతలు సరికొత్త రకాలు పండిస్తూ ‘ఔరా’అనిపిస్తున్నారు. వినూత్న పద్ధతులతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకుంటున్నారు. ఎర్రబెండ, సుమారు మూడు కిలోల బరువు తూగే విత్తన వంకాయ, మధుమేహ నివారణకు పనిచేసే బ్లాక్ రైస్ పండిస్తూ లాభాలు గడిస్తున్నారు. మార్కెట్లో అత్యధిక ధర పలికే రకాలను ఎంపిక చేసుకొని శాస్త్రవేత్తల సూచనలు, టెక్నాలజీ సాయంతో ముందుకు పోతున్నారు. సేంద్రియ ఎరువులనే వాడుతూ అధిక దిగుబడులు పొందుతూ తోటివారికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
వ్యవసాయంలో వినూత్న పద్ధతులతో కొందరు రైతులు అద్భుతాలు చేస్తున్నారు. కొత్త సాంకేతికతను అందిపుచ్చుకుంటూ అందరి కంటే భిన్నమైన ఆలోచనలతో ముందుకుపోతూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకుంటున్నారు. శాస్త్రవేత్తల సలహాలు, కొత్త టెక్నాలజీ వినియోగంతో కొత్త విత్తన రకాలతో పంటలు పండిస్తూ అధిక దిగుబడులు పొందుతున్నారు. వ్యవసాయం అంటే ఆహార భద్రత అనే నానుడిని నిజం చేసేలా ఉత్పత్తి ఎక్కువ వచ్చే విత్తనాలతో సాగు చేస్తున్నారు. మార్కెట్లో అత్యధిక ధర ఉండే రకాలను ఎంచుకుని ఎక్కువ పంటలు పండిస్తున్నారు. కొత్త దారిలో ముందుకు పోతున్న పలువురు రైతులు ఇప్పుడు తోటి రైతులకు దిక్సూచిగా మారుతున్నారు.
అతిపెద్ద వంకాయ..
గుండ్రటి వంకాలు సాధారణంగా కోడి గుడ్డు సైజులో ఉంటాయి. కానీ, జనగామ జిల్లా చి ల్పూరు మండలం వెంకటాద్రిపేటకు చెందిన ముక్కెర వీరారెడ్డి పొలంలో మాత్రం మూడు కిలోల బరువుండే వంకాయలు పండు తున్నాయి. వ్యవసాయం లాభసాటిగా ఉండాలనే ఆలోచనతో వీరా రెడ్డి సరికొత్తగా ఆలోచించాడు. వరి తరహాలోనే కూరగాయల విత్తనా లను ఉత్పత్తి చేయాలని అనుకున్నాడు. కొన్నేండ్లుగా కూరగాయల విత్తనాల పంటలు సాగు చేస్తున్నాడు. తాజాగా వంకాయ విత్తనాల ఉత్పత్తి కోసం సాగు చేశాడు. వీరారెడ్డి వంకాయ తోటను చూస్తే అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. ఒక్కో చెట్టకు గుత్తులుగా పదుల కొద్దీ పెద్దపెద్ద కాయలున్నాయి. ఒక్కో కాయ మూడు కిలోల వరకు ఉంటుంది. ఈ వంకాయలను తెంపిన తర్వాత ప్రత్యేక యంత్రాలతో విత్తనాలను తీసి ఢిల్లీకి, చైనాకు ఎగుమతి చేస్తున్నాడు. క్వింటాలు విత్తనాలకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ధర వస్తోంది. ‘ఇవి గూలబీ రకం వంకాయలు. పెద్ద సైజులో ఉంటాయి. జనగామ జిల్లా ఉద్యాన శాఖ అధికారుల సూచనలతో సాగు చేస్తున్నాను. అందుకే పెద్ద సైజు వచ్చింది’ అని వీరారెడ్డి వివరించాడు.
నల్లటి పొలం…
రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరిలో వరి పొలాలు మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తా యి. వరి నారు, వడ్లు అన్నీ నలుపు రంగులో నే ఉన్నాయి. గోవర్ధనగిరికి చెందిన రైతు ఎర్రం సురేశ్ వరిలో కొత్త రకం విత్తనాలను సాగు చేశాడు. సేంద్రియ (ఆర్గానిక్) రకానికి చెందిన బ్లాక్ రైస్ పండిస్తున్నాడు. లింగాల ఘణపురం మండలం జీడికల్లోని రైతు వెంక న్న వద్ద ఈ విత్తనాలు తెచ్చాడు. ఎకరాకు 12 బస్తాలు వచ్చా యి. వడ్లు కిలో రూ. 300.. బియ్యం కిలోకు రూ.350 చొప్పున అమ్ముతున్నాడు. ‘రసాయన ఎరువులు వాడిన బియ్యంతో రోగాలు వస్తున్నాయి. సేంద్రియ ఎరువులతో ఎరుపు, నలుపు రంగు వరి సాగు చేస్తు న్నాను. ఆరోగ్యకరమైన బియ్యం అందించడం నాకు ఎంతో తృప్తినిస్తోంది’ అని సురేశ్ చెప్పాడు.
ఎర్ర బెండకాయలు..
బెండ కాయలు అంటే అందరికీ ఆకుపచ్చ రంగులోనే ఉంటాయని తెలుసు. మిగతా పంటల్లో రంగులు వచ్చినా బెండలో మాత్రం మారలేదు. కానీ, హసన్పర్తి మండలం పెంబర్తికి చెందిన రైతు ఇనుగాల ప్రభాకర్రెడ్డి చెలకలో ఎర్రరకం బెండ సాగుచేస్తున్నాడు. ఎర్ర బెండకాయలతో తోట అంతా సరికొత్తగా కనిపిస్తున్నది. వరంగల్ నగరానికి దగ్గరగా ఉండడంతో దశాబ్దాలుగా ప్రభాకర్రెడ్డి కూరగాయలు సాగు చేస్తున్నా డు. బెండ, బీర, చికుడు, పచ్చి మిర్చి పంట లు వేస్తుంటాడు. కొత్త పంటలు వేయాలనే ఆలోచనతో వరంగల్లోని ఓ ఫెర్టిలైజర్ దుకా ణం నిర్వాహకుడు ఇచ్చిన సూచనతో రూ. 1400 పెట్టి 200 గ్రాముల ఎర్రబెండ విత్తన ప్యాకెట్ కొనుగోలు చేశాడు. నాలుగు గుంటల స్థలంలో ఎర్ర బెండకాయల సాగు మొదలుపెట్టాడు. మొదట్లో ఊరివాళ్లంతా ఆశ్చర్యంగా చూశారు. ప్రభాకర్రెడ్డి మాత్రం ధీమాతో ఉన్నాడు. అనుకున్నట్లుగానే పంట బాగా వచ్చింది. మామూలు బెండ కంటే ఎక్కువ లాభాలు వచ్చాయని ధీమాగా చెబుతున్నాడు. మరో పది గుంటల స్థలంలోనూ ఈ రకం పంటనే సాగు చేస్తున్నాడు. ఇప్పటి వరకు 8క్వింటాళ్ల బెండకాయల దిగుబడి వచ్చింది. సాధారణ రకం కంటే ఎర్ర బెండ కాయకు ధర ఎక్కువ ఉంది. సగటున కిలో రూ.40 పలుకుతున్నది. లాభాల సాగుతో ప్రభాకర్రెడ్డి ఇప్పుడు ఆ ఊరిలోనే కాదు మార్కెట్లోనూ మోడల్ రైతుగా మారాడు. ‘ఎర్ర బెండకాయను ప్రజలు ఇష్టంగా కొంటున్నారు. షుగర్ ఉన్న వారు వీటిని ఎక్కువ వాడుతున్నారు’ అని ప్రభాకర్రెడ్డి చెప్పాడు.