ఐదేళ్లలో 25 వేల మందికి పోలీస్ ఉద్యోగాలు
అడిషనల్ డీజీపీ వీవీ శ్రీనివాసరావు
మామునూరు పీటీఎస్లో దీక్షంత్ పరేడ్
కరీమాబాద్, జూలై 24 : తెలంగాణ రాష్ట్రంలో పోలీస్శాఖను ప్రభుత్వం బలోపేతం చేస్తున్నదని అడిషనల్ డీజీపీ వీవీ శ్రీనివాసరావు అన్నారు. మామునూరులోని పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో ప్రిన్సిపాల్ గంగారాం ఆధ్వర్యంలో శిక్షణ పొందిన 937 మంది కానిస్టేబుళ్లు శనివారం దీక్షంత్ పరేడ్ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా అడిషనల్ డీజీపీ వీవీ శ్రీనివాసరావు పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలీస్శాఖ కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతోందన్నారు. ఐదేళ్లలో దాదాపు 25వేల మందికి పోలీసు ఉద్యోగాలను ఇచ్చిందన్నారు. శిక్షణ పొందిన కానిస్టేబుళ్లు తెలంగాణ పోలీస్శాఖలో భాగస్వాములవుతున్నందుకు గర్వపడాలన్నారు. అనంతరం ఉద్యోగులకు బహుమతులు అందజేశారు. కాగా, అడిషనల్ డీజీపీని ప్రిన్సిపాల్ గంగారాం సత్కరించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాగ్యానాయక్, డీఎస్పీలు సుధీర్, శ్రీనివాస్, భోజారావు, అసిస్టెంట్ కమాండెంట్లు పాండు, భాస్కర్రావు, ట్రైనింగ్ ఆర్ఐ నవీన్, ఆర్ఐ చంద్రశేఖర్, కాశీరాం, శ్రీకాంత్, ఆర్ఎస్లు అరుణ, దశరథం, యుగేంధర్, హెచ్సీ మేకల చంద్రమౌళి, పీఆర్వో రామాచారి, సిబ్బంది పాల్గొన్నారు.
కోటి ఆశలతో కొత్త జీవితంలోకి..
ఉద్యోగాలు సాధించాలనే సంకల్పం.. ఖాకీ ఉద్యోగంపై ఉన్న మక్కువ వారిని పోలీస్ ఉద్యోగం వైపు నడిపించింది. పరీక్షలతో అర్హత సాధించి మామునూరులోని పీటీసీలో 9 నెలల శిక్షణ కాలం పూర్తి చేసుకుని 937 మంది పోలీసు ఉద్యోగాలను పొందారు. కోటి ఆశలతో, కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నారు. దీంతో ఉద్యోగాలు పొందిన కానిస్టేబుళ్లు, వారి కుటుంబ సభ్యుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. కాగా, దేశంలోనే ఉత్తమ పోలీస్ ట్రైనింగ్ కళాశాలగా మామునూరు పీటీసీకి పేరుంది. దీంతో పాటు ఇటీవల కేంద్ర ప్రభుత్వం సైతం ఉత్తమ శిక్షణ నిలయం అవార్డును అందజేసింది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన వారికి ఉత్తమ శిక్షణ అందిస్తూనే మహిళల కోసం ప్రత్యేక రక్షణ చర్యలను సైతం ఏర్పాటు చేశారు.
తొలిసారిగా 937 మందికి శిక్షణ…
మామునూరులో దాదాపు 32 ఏళ్ల క్రితం పోలీస్ ట్రైనింగ్ కళాశాలను ఏర్పాటు చేశారు. గతంలో 700 మంది పైచిలుకు మాత్రమే శిక్షణ పొందారు. కానీ, ప్రస్తుతం తొలిసారిగా 2021లో 937 మంది శిక్షణ పొందారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో సైతం అధికారులు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా 937 మందికి శిక్షణ పూర్తి చేసి, పరేడ్ నిర్వహించారు.