పంటలను కాపాడేందుకే నీటి విడుదల
జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు
అలుగుపారుతున్న అనంతారం, పెద్ద చెరువులు
ఆనందంలో అన్నదాతలు
ఇల్లంతకుంట/ముస్తాబాద్, ఏప్రిల్ 6: అపర భగీరథుడు సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో మండుటెండల్లోనూ చెరువులు మత్తళ్లు దూకుతున్నాయని జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు పేర్కొన్నారు. అన్నపూర్ణ ప్రాజెక్టు సర్ఫేజ్ గేట్ ద్వారా విడుదల చేసిన నీటితో అనంతారం చెరువు అలుగు పారింది. మంగళవారం బిక్కవాగులో సిద్ధం వేణుతోపాటు రైతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సిద్ధం వేణు మాట్లాడుతూ, పొట్ట దశలో ఉన్న వరి పంటలను కాపాడేందుకే అన్ని గ్రామాలకు కాళేశ్వరం జలాలను అందిస్తున్నామని తెలిపారు.
సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే రసమయి సహకారంతో అనంతారం చెరువు మండుటెండల్లోనూ మత్తడి దూకుతున్నదన్నారు. ఇక్కడ టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గొడుగు తిరుపతి, గ్రంథాలయ డైరెక్టర్ మల్లెంకి శ్రీనివాస్, నాయకులు కూనబోయిన బాలరాజు, అవా రు బాలయ్య, సావనపెల్లి రాకేశ్, గొడుగు నర్సయ్య, శ్రీనివాస్, రాములు, ఉస్మాన్ ఉన్నారు. అలాగే కాళేశ్వరం జలాలతో ముస్తాబాద్ పెద్ద చెరువు నిండుకుండలా మారింది. తుక్కాపూర్ పంప్హౌస్ నుంచి వస్తున్న మల్లన్నసాగర్ జలాలతో పెద్ద చెరువు అలుగు పారుతున్నది. ఎంపీపీ జనగామ శరత్రావు, ఉప సర్పంచ్ రవిగౌడ్తో పాటు పలువురు చెరువును సందర్శించి ఆనందం వ్యక్తం చేశారు.