పెట్రోల్, డీజిల్ ధరలు పెంచినందుకా?
రిజర్వేషన్లు ఎత్తేసే కుట్రలు చేస్తున్నందుకా?
కరంటు మోటర్లకు మీటర్లు పెట్టే చట్టం తెచ్చినందుకా?
గ్రామాల్లోకి వచ్చే బీజేపీ నాయకులను నిలదీయాలె
హన్మకొండ ఆర్డీవో డివిజన్లోనే కమలాపూర్
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
ఎంపీగా గెలిచి బండి సంజయ్ ఏం చేసిండు : ప్రభుత్వ విప్ బాల్క సుమన్
కమలాపూర్లో స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల పంపిణీ
కమలాపూర్, ఆగస్టు 7 : ‘బీజేపీకి ఓటెందుకు వేయా లి.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచినందుకా?.., ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఎత్తేసేందుకు కుట్రలు చేస్తున్నందుకా?.., కరంటు మోటార్లకు మీటర్లు పెట్టే చట్టం తెచ్చినందుకా..? ఎందుకు ఓటెయ్యాలో గ్రామాల్లోకి వచ్చే ఆ పార్టీ నాయకులు నిలదీయాల’ని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మహిళలకు పిలుపునిచ్చారు. శనివారం ఆయన వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ సబ్ వ్యవసాయ మార్కెట్లో స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్రంలోనే తొలిసారిగా ఇక్కడ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ వృద్ధులకు రూ. 2వేల పింఛన్ ఇచ్చి వారి ఆత్మగౌరవం నిలబెట్టాడన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రం కర్ణాటకలో రూ.500, ప్రధాని సొంతరాష్ట్రం గుజరాత్లో రూ.600 మాత్రమే పింఛన్ ఇస్తున్నట్లు గుర్తుచేశారు. ఈ నెల 15 నుంచి 57ఏళ్లు నిండిన వారికి కూడా రూ.2వేల పెన్షన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలు ఇస్తానని అధికారంలోకి వచ్చిన మోదీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. కేంద్రం వ్యవసాయ బావులకు మీటర్లు పెట్టే చట్టం తీసుకొస్తే కేసీఆర్ వ్యతిరేకించి ఒక్క మోటారుకు విద్యుత్ డిస్కంలకు ఏడాదికి లక్ష రుపాయలు చెల్లిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం లక్షా30వేల ఉద్యోగాలు భర్తీ చేసిందన్నారు. రైతులకు 24గంటల కరంటు, రైతుబంధు, బీమా, ఆడబిడ్డల పెళ్లికి కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్టు, స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలకు రూ.3లక్షల వరకు వడ్డీలేని రుణాలు అందిస్తున్న మహానుబావుడు కేసీఆర్ అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి 4వేల డబు ల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తే ఏడేండ్లు మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ ఒక్క ఇల్లూ కట్టియ్యలేదన్నారు.
అదే పాలకుర్తిలో తాను 5వేలు, పరకాలలో ఎమ్మెల్యే ధర్మారెడ్డి 760 ఇండ్లు కట్టించి లబ్ధిదారులకు ఇచ్చినట్లు తెలిపారు. అలాగే హన్మకొండ రెవెన్యూ డివిజన్లోనే కమలాపూర్ ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. మహిళలకు రూ.30కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు చెప్పారు. ఒక్కో మహిళకు రూ.3లక్షలు ఇస్తామని, రుణం తీసుకు న్న మహిళకు ఏదైనా జరిగితే కట్టిన డబ్బు తిరిగి వాప సు ఇస్తామన్నారు. మండలంలోని 24 గ్రామాల్లోని 1470 స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న 17,255 మంది సభ్యులకు 29. 51కోట్ల వడ్డీ లేని, బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి రుణాల చెక్కులను మంత్రి అందజేశారు.
విప్ బాల్క సుమన్ మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని భావించిన సీఎం కేసీఆర్ వడ్డీలేని రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఏడేండ్లలో మహిళలకు రూ.150 కోట్లు ఇచ్చినట్లు చెప్పారు. 5ఎకరాల్లో కోట నిర్మించుకున్న ఈటల రాజేందర్ మహిళలకు కమ్యూనిటీ భవనాలు నిర్మించలేదన్నారు. రానున్న ఉపఎన్నికల్లో సానుభూతి కోసం కట్టు కట్టుకుని వస్తరు. వారి మాటలు నమ్మి మోసపోవద్దని మహిళలను కోరారు. కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ మండలంలో రూ.10లక్షల పనైనా చేసిండా ప్రశ్నించారు. ఎన్నటికైనా పనిచేసే ప్రభుత్వం టీఆర్ఎస్సేనని గుర్తు పెట్టుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, జడ్పీ చైర్మన్ మారపల్లి సుధీర్కుమార్, కలెక్టర్ ఆర్జీవీ హన్మంతు, డీఆర్డీవో శ్రీనివాస్, సర్పంచ్ కట్కూరి విజయ, జడ్పీటీసీ కల్యాణి, వైస్ ఎంపీపీ శైలజ, ఎంపీడీవో పల్లవి, ఎంపీటీసీలు రాధిక, అరుణ, వెంకటేశ్వర్లు, సర్పంచ్ల ఫోరం కన్వీనర్ రవిందర్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం కన్వీనర్ సంపత్రావు, నాయకులు తక్కళ్లపల్లి సత్యనారాయణరావు, పింగిళి ప్రదీప్రెడ్డి, ఏపీఎం నారాయణ, కళాకారుడు సాయిచంద్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
చేనేత కార్మికులకు సన్మానం
జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం మండల కేంద్రంలోని చేనేత కార్మికులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సన్మానించారు. కమలాపూర్కు వచ్చిన ఆయన చేనేత సంఘానికి వెళ్లి నేతన్నలను పలుకరించి, శాలువాతో సన్మానించారు. అనంతరం మగ్గంపై కూర్చోని రాట్నం తిప్పి కార్మికుల్లో ఉత్సాహం నింపారు.