ఉమ్మడి జిల్లాలో విస్తారంగా వానలు
మత్తడి దుంకుతున్న చెరువులు
పొంగుతున్న వాగులు
నిండుగా జలాశయాలు
మానుకోట, బయ్యారంలో 11సెంటీమీటర్ల వర్షపాతం
పత్తికి ప్రాణం.. ఇతర పంటలకు ఊతం
మరో మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం
సాగు పనుల్లో ఉత్సాహంగా రైతాంగం
వరంగల్, జూలై 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాలం ఆరంభంలోనే వారం పాటు దంచికొట్టిన వానలు, సుమారు 20రోజులుగా నెమ్మదించాయి. ఇక పత్తి విత్తనాలు వేసి ఎదురుచూస్తున్న సమయంలో రెండు మూడు రోజుల నుంచి ఉమ్మడి జిల్లాలో విస్తారంగా కురుస్తూ పత్తికి ప్రాణం పోశాయి. ఇతర పంటలకు సైతం ఊతమిచ్చేలా వానలు పడుతున్నాయి. ఇదివరకే నిండి ఉన్న నీటి వనరులు తాజా వర్షాలతో మత్తళ్లు దుంకుతున్నాయి. వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. మరో మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించగా.. సాగు పనులు సైతం జోరందుకుంటున్నాయి. దుక్కులు దున్నే.. నాట్లు వేసే రైతులతో పొలాలు కళకళలాడుతున్నాయి.
వానకాలం జోరందుకుంది. రైతులకు సంబురం వచ్చింది. కాలం మొదట్లోనే జోరుగా పడ్డ వానలు, తర్వాత నెమ్మదించాయి. తాజాగా మూడు రోజుల నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా పడుతున్నాయి. సాధారణం కంటే మంచి వానలు కురుస్తున్నాయి. పత్తి, మక్క, పెసర, పల్లి, మినుము పంటలకు జీవం పోశాయి. నిన్నమొన్నటిదాకా వానలు లేకపోగా ఎండలు దంచికొట్టాయి. దీంతో నల్లరేగడి మినహా ఇతర నేలల్లో పత్తి మొక్కలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. దీంతో రైతులు ఆందోళనలో పడ్డారు. ఈ సమయంలో మంచి వర్షాలు పడడంతో రైతులు నిమ్మలమయ్యారు. రోహిణి కార్తెలో వరి నారు పోసిన రైతులు నాట్లు వేసేందుకు పొలం సిద్ధం చేస్తున్నారు. తాజా వానలతో సాగు పనుల జోరు పెంచారు.
నీటి వనరులకు మత్తళ్లు
మహబూబాబాద్, బయ్యారం మండలాల్లో శుక్రవారం అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తాడ్వాయిలో 7, పేరూరు (ములుగు జిల్లా), ధర్మసాగర్, కొత్తగూడ, ఏటూరునాగారం, హసన్పర్తి మండలాల్లో 6 సెంటీమీటర్లు కురిసింది. గార్ల, జనగామ, మొగుళ్లపల్లి మండలాల్లో 5, భూపాలపల్లి, వెంకటాపూర్, ఖానాపూర్, పర్వతగిరి, హన్మకొండ, వెంకటాపురం, డోర్నకల్, చెన్నారావుపేట, పాలకుర్తి, రఘునాథపల్లి మండలాల్లో 3, నల్లబెల్లి, గూడూరు, దేవరుప్పుల మండలాల్లో 2, నర్సంపేట, నర్మెట మండలాల్లో ఒక సెంటీ మీటరు చొప్పున నమోదైంది. నర్సింహులపేట మండలం కొమ్ములవంచ శివారులోని ఆకేరు ఆనకట్ట మత్తడి పోస్తున్నది. కురవి మండలంలోని చెరువులు నిండుకుండల్లా మారాయి. రాయినిపట్నం వద్ద ఉన్న లోలెవల్ వంతెనపై నీరు ఉధృతంగా ప్రవహిస్తుండగా, నేరడ పెద్దచెరువు అలుగు దుంకుతున్నది. పరకాల శివారులోని చలివాగు చెక్డ్యాం నిండింది. వెంకటాపూర్ మండలం సింగరకుంట పల్లె సమీపంలోని పడాల మల్లయ్య చెరువు మత్తడి పడుతోంది. బయ్యారం మండలంలోని పందిపంపుల, మసివాగు, అలిగేరు, పాకాల ఏరు ప్రవహిస్తున్నాయి. పెద్ద చెరువు, తులారం ప్రాజెక్ట్లోకి వరద నీరు చేరుతుండగా, గౌరారం కట్ట అలుగు పడింది. గోవిందరావుపేట మండలంలోని లక్నవరం సరస్సు నీటిమట్టం 22 అడుగులకు చేరింది. డోర్నకల్ శివారులో మున్నేరు వాగు చెక్డ్యామ్ మత్తడి పోస్తున్నది. ఎల్కతుర్తి మండలం ఊడ్గులలోని కుంట అలుగు పారుతున్నది.