సుబేదారి, సెప్టెంబర్ 23 : గంజాయి స్మగ్లర్లపై వరంగల్ పోలీస్ కమిషనరేట్ టాస్క్ఫోర్స్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. మూడు వేర్వేరు సంఘటనల్లో గురువారం 11 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.32 లక్షల విలువైన గంజాయి, రెండు కార్లు, మూడు ఆటోలు, 11 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. హనుమకొండలోని వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిందితుల వివరాలను కమిషనర్ డాక్టర్ తరుణ్జోషి వెల్లడించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వర్ధన్నపేటకు చెందిన బోరం సాయికుమార్, ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా గాటంపల్లికి చెందిన వెంకట్, గోదపర్తి వెంకట్, మహబుబాబాద్కు చెందిన భూక్యా రాములు, ఎస్కే కలీల్, కరీంనగర్కు చెందిన కొనమల సునీల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకకు చెందిన బత్ర నరేశ్, తూముల క్రాంతికుమార్, తుముల నాగరాజు, జీ మనోజ్, మారంపడి శ్రీను ముఠాగా ఏర్పడ్డారు. జల్సాలకు అలవాటుపడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ఆంధ్రప్రదేశ్-ఒడిశా సరిహద్దులో ఉన్న సీలేరు, మోతుగూడెం ప్రాంతాల్లో గుర్తుతెలియని వ్యక్తుల నుంచి తక్కువ ధరకు గంజాయి కొనుగోలుచేసి రహస్యంగా కారులో విశాఖపట్నం, రాజమండ్రి, భద్రాచలం కొత్తగూడెం, నర్సంపేట, ఖమ్మం, వరంగల్ నుంచి ఇతర ప్రాంతాలకు తరలించి ఎక్కువ ధరకు విక్రయించి సొమ్ముచేసుకునేవారు.
సమాచారం తెలుసుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు, వర్ధన్నపేట పోలీసులు ఖమ్మం-వరంగల్ రహదారిపై ఉన్న డీసీ తండా వద్ద గురువారం వాహనాలు తనిఖీ చేశారు. ఓ కారులో 128 కిలోల గంజాయి దొరికింది. పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. మరో సంఘటనలో టాస్క్ఫోర్స్ పోలీసులు, నల్లబెల్లి పోలీసులు కలిసి నల్లబెల్లి శివారులో వాహనాలు తనిఖీ చేయగా కారు, ఆటోలో 134 కిలోల గంజాయి లభ్యమైంది. మహబుబాబాద్కు చెందిన భూక్యా రాములు, ఎస్కే కలీల్, కరీంనగర్కు చెందిన కొనమల సునీల్ను అరెస్టు చేశారు. అదేవిధంగా ఖానాపురంలో రెండు ఆటోలను తనిఖీ చేయగా 56 కిలోల గంజాయి దొరికింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకకు చెందిన బత్ర నరేశ్, తూముల క్రాంతికుమార్, తూముల నాగరాజు, జీ మనోజ్, మారంపడి శ్రీనును అరెస్టు చేశారు. ఈ ఘటనల్లో 11 మంది నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన వెస్ట్ జోన్, ఈస్ట్ జోన్ డీసీపీలు శ్రీనివాస్రెడ్డి, వెంకటలక్ష్మి, టాస్క్ఫోర్స్, వర్ధన్నపేట, నర్సంపేట ఏసీపీలు ప్రతాప్కుమార్, ఫణీందర్, సీఐలు సదన్కుమార్, సతీశ్, సంతోష్, సిబ్బందిని సీపీ తరుణ్జోషి అభినందించారు.