కోదాడ రూరల్, ఏప్రిల్ 25 : సూర్యాపేట జిల్లా కోదాడ శివారులో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ మండలం చిమిర్యాల గ్రామానికి చెందిన శ్రీకాంత్ హైదరాబాద్లోని మణికొండ ఫ్రెండ్స్ కాలనీలో ఉంటూ కారు డ్రైవర్గా జీవనం సాగిస్తున్నారు. గురువారం చిన్న కూతురు లావణ్య పుట్టిన రోజు ఉండటంతో తన కుటుంబంతోపాటు అత్తగారి కుటుంబ సభ్యులతో కలిసి పుట్టు వెంట్రుకలు తీయించేందుకు బుధవారం రాత్రి విజయవాడ దగ్గర గల గుణదల మేరీమాత చర్చికి కారులో బయల్దేరారు.
గురువారం తెల్లవారుజామున సుమారు 4.45 గంటల సమయంలో కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం శివారుకు చేరుకోగానే 65వ నంబర్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు వేగంగా వెళ్లి ఢీకొట్టింది. దీంతో శ్రీకాంత్ (32), ఆయన పెద్ద కూతురు లాస్య (4)తోపాటు ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం గోవిందాపురం-ఎల్ గ్రామానికి చెందిన మామ నల్లమల్ల రాంచందర్రావు (50), అత్త మాణిక్యమ్మ (45), బావమరిది కృష్ణంరాజు (26), కృష్ణంరాజు భార్య స్వర్ణకుమారి (23) అక్కడికక్కడే మరణించారు.
శ్రీకాంత్ భార్య నాగమణి, చిన్న కూతురు లావణ్య, కృష్ణంరాజు కుమారులు కౌశిక్, కార్తీక్ గాయపడటంతో 108 అంబులెన్స్లో కోదాడ ఏరియా దవాఖానకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్సకు ఖమ్మం తీసుకెళ్లారు. ఎస్పీ రాహుల్హెగ్డే ప్రమాద స్థలాన్ని పరిశీలించి, దవాఖానకు వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. శ్రీకాంత్ బంధువు నందిగామ రాజశేఖర్ ఫిర్యాదు మేరకు కోదాడ డీఎస్పీ శ్రీధర్రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.