వనపర్తి, జనవరి 23 : రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజల ఆశ్వీరాదం ఎల్లప్పుడూ ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ప్రతి నిమిషం ప్రజల కోసం పని చేస్తున్నామని స్పష్టం చేశారు. నియోజకవర్గ పరిధిలోని పలు మండలాల, గ్రామాల, పట్టణాలకు చెందిన 112 మంది లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులను ఆదివారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి పంపిణీ చేశారు. ముందుగా లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం పెబ్బేర్ మండలం యాపర్ల గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన నాయకులు మంత్రి నిరంజన్రెడ్డి సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. వీరికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా మంత్రి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ స్వరాష్ట్ర పాలనలో ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం ఆలోచిస్తున్నామని తెలిపారు. కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, కంటికి రెప్పలా కాపాడుకుంటామని మంత్రి పేర్కొన్నారు. యాపర్ల గ్రామ అభివృద్ధికి సహకారం అందిస్తామని చెప్పారు.
బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పని చేస్తున్నామని తెలిపారు. వాల్మీకుల రిజర్వేషన్ కోసం ప్రయత్నిస్తున్నామని, వారి సమస్యల పరిష్కారానికి పని చేస్తున్నదని టీఆర్ఎస్ మాత్రమేనని గుర్తు చేశారు. రాష్ట్ర సమస్యల పరిష్కారంలో కేంద్రం సహాయ నిరాకరణ చేస్తున్నదని, బీజేపీ యేతర రాష్ర్టాలపై నిర్లక్ష్యం వహిస్తున్నదని ధ్వజమెత్తారు. ప్రతి విషయంలో రాజకీయ కోణంలో ఆలోచిస్తుందని, ప్రజలంతా ఈ దేశ పౌరులే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. వారి విషయంలో రాజకీయంగా ఆలోచించడం విచారకరణమని పేర్కొన్నారు. తెలంగాణ చైతన్యవంతమైన నేల అని, ప్రజలకు జాతీయ పార్టీల మాదిరిగా సంకుచిత మనస్తత్వం లేదని, ప్రజల సమస్య దృష్టికి వస్తే పరిష్కరిస్తామని, రాజకీయం చేయమని మంత్రి వివరించారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, రవి నాయుడు, తిరుమల్, నాయకులు పాల్గొన్నారు.