తిమ్మాజిపేట, జూన్ 22: ప్రస్తుతం ప్రజలు కరోనా వైరస్ను తట్టుకునేందుకు రోగనిరోధకశక్తిని పెంచే ఆహారానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎక్కువగా పండ్లు, డ్రైఫ్రూట్స్ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కువగా వినిపిస్తున్న పండు డ్రాగన్ ఫ్రూట్. ఈ పండు మన ప్రాంతంలో ఎక్కువగా కనిపించదు. కానీ, ఓ యువ గిరిజన రైతు సాగు చేస్తున్నాడు. సంప్రదాయ, వాణిజ్య పంటలు సాగుచేసి నష్టాలు చవిచూసిన ఆ రైతు తన స్నేహితుడి ద్వారా సాగు వివరాలు తెలుసుకొని గతేడాది సాగు ప్రారంభించాడు. నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం హెమ్లానాయక్తండా పరిధిలోని సూర్యానాయక్తండాకు చెందిన వడ్త్యవత్ శంకర్ యువరైతు ఇన్కమ్ టాక్స్ కన్సల్టెంట్గా ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంటాడు.
అతడికి తండాలో నాలుగెకరాల భూమి ఉన్నది. గతంలో పలు రకాల పంటలు సాగు చేసి నష్టపోయిన శంకర్ డ్రాగన్ ఫ్రూట్ సాగుకు శ్రీకారం చుట్టారు. సంగారెడ్డి, ఇబ్రహీంపట్నాలకు చెందిన స్నేహితుల ద్వారా పంట వివరాలు తెలుసుకొని రెండెకరాల్లో సాగు ప్రారంభించాడు. పొలానికి కంచె ఏర్పాటు చేసి స్తంభాలను ఏర్పాటు చేశారు. ఎకరాలో 500మొక్కలను నాటాడు. మొక్కలను సంగారెడ్డి, ఇబ్రహీంపట్నంలో రూ.70కి ఒకటి చొప్పున కొనుగోలు చేశారు. ఒక్కో స్తంభానికి రెండు మొక్కలు నాటాడు. సేంద్రియ పద్ధతిలో సాగు ప్రారంభించారు. గతేడాది ప్రారంభించిన పంట ప్రస్తుతం పండ్లు కాస్తుందని తెలిపారు. ఎకరాకు రెండు రోజులకోసారి 50కిలోల దిగుబడి వస్తుందని, మార్కెట్లో కిలో రూ.150 నుంచి రూ.250దాక పలుకుతుందన్నారు. ప్రస్తుతం ఆవు పేడ, జీవామృతం, వేపనూనె ఎరువులుగా వాడుతున్నట్లు శంకర్ తెలిపారు. సంవత్సరం నుంచి ఆదాయం వచ్చే ఈ పంటను ఒక్కసారి వేస్తే 20ఏండ్ల దాకా ఆదాయం వస్తుందని, ఏటా రూ.9లక్షల నుంచి రూ.12లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు.
నాగర్కర్నూల్ జిల్లాలో డ్రాగన్ ఫ్రూట్ తానే సాగు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సాగు మొదట కొంత ఖర్చుతో కూడుకున్నదన్నారు. రూ. 6లక్షల నుంచి రూ.8లక్షల దాక ఎకరాకు ఖర్చు అవుతుందని తెలిపారు. రెండెకరాలకు కొద్ది నీరు ఉన్నా సరిపోతుందన్నారు. కూలీల ఖర్చు కూడా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం కొంత మొత్తం దిగుబడి వస్తుండడంతో జడ్చర్ల, మహబూబ్నగర్ ప్రాంతంలో విక్రయిస్తున్నట్లు తెలిపారు. అధిక పోషకాలు ఉండే ఈ పండును పట్టణాల్లో ఎక్కువగా ఇష్టపడుతున్నారని శంకర్ ఈ సందర్భంగా తెలిపారు. డ్రాగన్ ఫ్రూట్తోపాటు, సీతాఫలం, పొప్పిడి, శ్రీగంధం పంటలను సాగు చేస్తున్నాడు. ఔత్సాహిక రైతులు ముందుకొస్తే మొక్కలు అందిస్తానని శంకర్ తెలిపారు. వినూత్నంగా సాగు చేస్తున్న శంకర్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
డ్రాగన్ ఫ్రూట్కు మంచి డిమాండ్
డ్రాగన్ ఫ్రూట్ సాగుపై పూర్తి అవగాహన వచ్చి, క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన తర్వాతనే సాగుచేస్తున్నాను. స్నేహితులు, యుట్యాబ్లో పంట వివరాలు, లాభనష్టాలను తెలుసుకున్నాను. ఏడాదిపాటు శ్రమిస్తే రెండు దశాబ్దాలు ఆదాయం వస్తుంది. ఎకరా పొలం, కొద్దిపాటు నీరు ఉంటే సాగు చేయొచ్చు. వాతావరణ పరిస్థితుల ప్రభావం పంటపై ఉండదు. ప్రస్తుతం మార్కెట్లో డ్రాగన్ ఫ్రూట్కు మంచి డిమాండ్ ఉంది. ఎవరైనా రైతులు ముందుకొస్తే వారికి పూర్తి సహకారం అందిస్తాను.