జగిత్యాల : క్రికెట్ పోటీల్లో భాగంగా పరుగుతీస్తున్న ఓ యువకుడు మైదానంలోనే కుప్పకూలాడు. జిల్లాలోని మేడిపల్లిలో శుక్రవారం జరిగిన ఈ ఘటన పలువురిని కంటతడిపెట్టించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడిపల్లిలో ఈ నెల 8న మహిళా దినోత్సవం సందర్భంగా క్రికెట్ టోర్నీని ప్రారంభించారు. శుక్రవారం కోరుట్ల మండలంలోని మోహన్రావుపేట, చింతలపేట జట్లు తలపడ్డాయి. మోహన్రావుపేట జట్టు క్రీడాకారుడు అబ్దుల్ రజాక్ (40) బాల్ను కొట్టి మొదటి పరుగు తీశాడు.
రెండో రన్ కోసం పరుగెడుతుండగా ఒక్కసారిగా కిందపడిపోయాడు. తోటి క్రీడాకారులు జగిత్యాల ప్రభుత్వ దవాఖానకు తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. అబ్దుల్ రజాక్కు భార్య హాఫియా, కుమారులు మున్నా, ఫరహాన్ ఉన్నారు.