ఏరువాక సాగారో రన్నో.. చిన్నన్న.. నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్న.. అంటూ జిల్లా రైతులు గురువారం ఏరువాక పౌర్ణమిని ఘనంగా జరుపుకొన్నారు. ఆయా గ్రామాల్లో ఎద్దులను, బండ్లను కడిగి రకరకాల రంగులతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. నైవేద్యంగా పొంగలి వండి ఎద్దులకు తినిపించారు. సాయంత్రం డప్పు చప్పుళ్ల మధ్య ఎడ్ల బండ్లను గ్రామ పుర వీధుల్లో ఊరేగిస్తూ సందడి చేశారు. దేవాలయాల చుట్టూ ఎడ్ల బండ్లను తిప్పి మొక్కులు చెల్లించుకున్నారు.
వికారాబాద్, జూన్ 24: భారతీయ సం స్కృతికి, జీవన విధానానికి మూలస్తంభం లాంటింది వ్యవసాయం, దీనికి తొలి పనిముట్టు నాగలి, ముఖ్యవనరు వర్షం. వానకాలం మొదలయ్యేక్రమంలో రైతులు కృతజ్ఞతతో జరిపే పండుగ ఏరువాక. జిల్లాలోని పలు గ్రామాల్లో ఏరువాక పౌర్ణమిని గురువారం ఘనంగా నిర్వహించారు. వికారాబాద్ మండలంలోని చిట్టంపల్లితో పాటు కొట్టాలగూడ, జైదుపల్లి, పీలారం, మైలార్దేవరంపల్లి, మదన్పల్లి, పులుమద్ది, ఎర్రవల్లి తదితర గ్రామాల్లో రైతులు ఏరువాక పండుగ సందర్భంగా ఎద్దులను అందంగా తీర్చిదిద్దారు. జ్యేష్ట పౌర్ణమి నాడు రైతులు ఏరువాక పండుగగా జరుపుకొంటారు. వ్యవసాయానికి ఎద్దులే ఆధారం. అవి లేకుండా ఏ పనీ జరుగదు. అందుకే ఎద్దులను దైవంగా భావించి, ఈ రోజు పూజిస్తారు. ఎద్దులను కడిగి వాటి కొమ్ములకు రంగులు పూసి, మెడలో కొత్త గంటలు, రంగుల పూసలు, పూలతో అలంకరించారు. పశువులకు పసుపు, కుంకుమతో పూజలు చేసి, ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ముఖ్యంగా పొంగలి వండి ఎద్దులకు తినిపించారు. సాయంత్రం సమయంలో గ్రామాల్లో డప్పుచప్పుళ్ల మధ్య ఎద్దులను ఊరేగించారు. గ్రామాల్లోని దేవాలయాల చుట్టూ ఎడ్ల బండ్లు, ఎద్దులను తిప్పి పూజలు చేశారు. ఎద్దులను అందంగా అలంకరించడంలో రైతులు పోటీ పడ్డారు. గ్రామస్తులంతా కలిసి ఏరువాక పండుగను జరుపుకొన్నారు.