పరిగి : పరిగి పట్టణంలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. శనివారం పరిగిలోని 12వ వార్డు షిరిడి సాయిరాం కాలనీలో నూతనంగా వేసిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే మహేశ్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. త్వరలోనే మరిన్ని అభివృద్ధి పనులకు ఇటీవలే మున్సిపల్ పాలకవర్గం ఆమోదించిందని తెలిపారు.
పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని ఎమ్మెల్యే అన్నారు. అవసరమున్న చోట్ల సీసీ రోడ్లు, మురుగుకాలువల నిర్మాణం చేపడుతామని చెప్పారు. ప్రత్యేక నిధులు రూ.10కోట్లతో వివిధ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, రూ.5కోట్ల విలువ చేసే పనులు త్వరలోనే ప్రారంభం అవుతాయని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముకుందఅశోక్, మార్కెట్ చైర్మన్ ఎ.సురేందర్, మాజీ ఎంపీపీ కె.శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు బి.ప్రవీణ్కుమార్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్కుమార్, కౌన్సిలర్లు మునీర్, వేముల కిరణ్, ఎదిరె కృష్ణ, వెంకటేష్, నాగేశ్వర్రావు, టీఆర్ఎస్ నాయకులు బి.రవికుమార్, ఆకారపు రాజు పాల్గొన్నారు.
పిల్లలు ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలి
ఏడాది నుంచి 19 సంవత్సరాల లోపు పిల్లలందరూ నులిపురుగుల నిర్మూలనకు ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి సూచించారు. నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా శనివారం పరిగిలో చిన్నారులకు ఎమ్మెల్యే మహేశ్రెడ్డి ఆల్బెండజోల్ మాత్రలు వేశారు.