త్వరలో పంటల సాగు వివరాల సేకరణ
ఈ నెల 4న అగ్రికల్చర్ అధికారులకు శిక్షణ
15వ తేదీ వరకు పూర్తి కానున్న సర్వే
జిల్లాలో 2.39 లక్షల మంది రైతులు
75 వేల ఎకరాల్లో వరి సాగు, మిగతా ఎకరాల్లో వివిధ పంటలు
ప్రతి గ్రామంలో పర్యటిం చనున్న ఏఈవోలు
18 మండలాల పరిధిలోని నాలుగు డివిజన్లలో 97 క్లస్టర్లు
వికారాబాద్, ఆగస్టు 1, (నమస్తే తెలంగాణ) : అన్నదాతల శ్రేయస్సు కోసం తెలంగాణ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నది. సబ్సిడీ ఎరువులు, పెట్టుబడి సాయాన్ని అందజేస్తూ కొండంత అండగా నిలుస్తున్నది. రైతులు నష్టపోవద్దన్న సదుద్దేశంతో ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నది. అన్నదాతలు ఏఏ పంటలు సాగు చేస్తున్నారో తెలుసుకునేందుకు పంటల వారీగా సర్వే చేసేందుకు వ్యవసాయ శాఖ సమాయత్తమవుతున్నది. ఈ నెల 15వ తేదీ వరకల్లా పంటల సర్వే పూర్తి చేసేందుకు క్లస్టర్ల వారీగా వ్యవసాయ విస్తరణ అధికారులకు ఈ నెల 4న శిక్షణ, అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నది. ప్రతి గ్రామంలో ఏఈవోలు పర్యటించి పంటల వివరాలను సేకరించాల్సి ఉంటుంది. జిల్లాలోని 18 మండలాల పరిధిలోని నాలుగు డివిజన్లలో 97 క్లస్టర్లు ఉన్నాయి. జిల్లాలో 2.39 లక్షల మంది రైతులు ఉండగా, 5.88లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేయనున్నట్లు అధికారులు అంచనా వేయగా, ఇప్పటికే 5.4లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అధికంగా 75 వేల ఎకరాల్లో వరి సాగు చేయగా, మిగతా ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈసారి సాగు విస్తీర్ణం పెరుగనుండగా, పంటల లెక్కలు పక్కాగా తేలనున్నాయి.
జిల్లాలో పంటల వారీగా సాగు వివరాలను సేకరించేందుకు సమాయత్తమవుతున్నారు. సర్కారు సూచించిన పంటలు రైతులు సాగు చేశారా.. లేదా వేరే పంటలు సాగు చేస్తున్నారా..? అనే దానిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన ఇద్దరు వ్యవసాయాధికారులకు శిక్షణ, అవగాహన కార్యక్రమానికి హాజరు కావాలని ఆదేశాలు అందాయి. ఈ నెల మొదటి వారంలో వారికి ఈ కార్యక్రమం ఉండగా.. ఆ తర్వాత మండల వ్యవసాయాధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈవో) క్లస్టర్ల వారీగా అవగాహన కల్పించనున్నారు. ఈ ఏడాది గతేడాది కంటే జూలై నెలలోనే పంటలకు పుష్కలంగా నీరొచ్చింది. ఈ ఏడాది పంటల సాగు పెరుగనుంది. జిల్లాలో పంటల సాగు లెక్కలు.. పక్కాగా తేల్చనున్నారు. పంటల సాగు వివరాలతో వివిధ ఏరియాల్లో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాలపై ప్రభుత్వం కసరత్తు చేసే అవకాశమున్నట్లు అధికారులు చెబుతున్నారు. గతేడాది కొనుగోలు కేంద్రాలకు మించి ధాన్యం రావడంతో ఈసారి ముందస్తుగానే ఏర్పాట్లకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ విధంగా రైతులవారీగా సేకరించిన వివరాలను ఏఈవోలు వారి ట్యాబ్ల ద్వారా ‘క్రాప్ బుకింగ్’ చేసి పోర్టల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. జిల్లాలోని 18 మండలాల పరిధిలో నాలుగు డివిజన్లు 97 క్లస్టర్లు ఉన్నాయి.
2.50లక్షల మంది రైతులు అంచనా..
జిల్లాలో 2.50లక్షల మంది రైతులున్నట్లు అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు డిజిటల్ పాస్ బుక్స్ ఆధారంగా 2.39లక్షల మంది నమోదై ఉన్నారు. జిల్లాలో ఈ ఏడాది 5.88లక్షల ఎకరాల సాగు అంచనా ఉండగా.. ఇప్పటికే 5.4లక్షల ఎకరాలు సాగైంది.75వేల ఎకరాల్లో వరి, 4.65లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. మరో 70-80 వేల ఎకరాల్లో వరి సాగు చేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఈ పంటల సాగుకు సంబంధించి రైతులకు ఉన్న భూమి విస్తీర్ణం, సాగు చేస్తున్న పంటల వివరాలను వ్యవసాయ విస్తరణ అధికారులు చేపట్టనున్నారు. ఆ వివరాలను ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్లో పొందుపర్చేందుకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రస్థాయి వ్యవసాయశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు(సీఎం కేసీఆర్, మంత్రులు) వారి కార్యాలయాల నుంచి జిల్లా, మండలం, గ్రామాలవారీగా ఎక్కడెక్కడ ఏ రైతు ఏ పంట సాగు చేస్తున్నారని తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడనుంది. ఈ వివరాలను ఆగస్టు నెలఖారులోగా సేకరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఈ నెల 4న ఎంసీహెచ్ఆర్డీలో శిక్షణ
జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయంలో విధులు నిర్వహించే ఏఈవో ఝాన్సీ లక్ష్మి, కొడంగల్ డివిజన్ ఏవో వినయ్కుమార్ ఈ నెల 4న ఎంసీహెచ్ఆర్డీలో శిక్షణ, అవగాహన కార్యక్రమానికి హాజరు కానున్నారు. వీరు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఏఈవోలకు అవగాహన కల్పించి ఆన్లైన్ నమోదు ప్రక్రియకు ఏర్పాట్లు చేస్తారు.
సేంద్రియ పద్ధతుల్లో పంటల సాగు చేపట్టాలి
కడ్తాల్, ఆగస్టు 1 : అన్నదాతలు సేంద్రియ పద్ధతుల్లో పంటల సాగు చేపట్టాలని వాటర్ మేనేజ్మెంట్ ఫోరం, ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ (ఇండియా) చైర్మన్ శ్యామ్ప్రసాద్రెడ్డి, సీజీఆర్ వ్యవస్థాపకురాలు లీలాలక్ష్మారెడ్డి అన్నారు. మండల పరిధిలోని అన్మాస్పల్లి గ్రామ సమీపంలో గల ఎర్త్ సెంటర్లో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవెల్యూషన్ ఆధ్వర్యంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న సుస్థిర వ్యవసాయంపై అవగాహన సదస్సు ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో శ్యామ్ప్రసాద్రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో రైతులందరూ సుస్థిర వ్యవసాయంపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. నీటి వనరులను, వాన నీటిని వినియోగించుకోవాలన్నారు. పొలాల వద్ద ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకుంటే భూగర్భ జలాలు పెరుగుతాయని చెప్పారు. వరి, పత్తి, మక్క పంటలతోపాటు చిరు ధాన్యాలను పండించాలని పేర్కొన్నారు. పంటల సాగులో రసాయనాల వినియోగాన్ని తగ్గించుకోవాలని, సేంద్రియ ఎరువులను వాడాలని తెలిపారు. నీటి సంరక్షణతోనే సుస్థిర వ్యవసాయం సాధ్యపడుతుందన్నారు. పలు జిల్లాల నుంచి వచ్చిన 30 మంది యువ రైతులు సుస్థిర వ్యవసాయంపై సందేహాలను సదస్సు నిర్వాహకులు నివృతి చేశారు. కార్యక్రమంలో గ్రామ భారతి ఫౌండేషన్ చైర్మన్ స్తంభాద్రిరెడ్డి, సభ్యులు హుస్సేన్బాబు, శ్రీనివాస్రెడ్డి, ఇందిరారెడ్డి, సత్యవర్ధన్రెడ్డి, సాయిభాస్కర్రెడ్డి, ఉమామహేశ్వర్రెడ్డి, కృష్ణ, వెంకటేశ్, రజనీకాంత్ ఉన్నారు.