తాండూరు : తాండూరు పట్టణం నడి బొడ్డున ఉన్న నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలోని అతిథిగృహ భవనం ఇరవై ఏండ్లుగా శిథిలావస్థలో ఉన్నది. 1910 నైజాం నవాబుల కాలంలో ఈ అతిథి గృహాన్ని నిర్మించడంతో వందేళ్లు దాటిపోయింది. పదేండ్ల క్రితం నీటి పారుదల శాఖ అధికారులు రూ.4 కోట్ల అంచనాతో అతిథి గృహం భవన నిర్మాణానికి ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి పంపారు. అయితే ఈ నిధుల మంజూరుకు అప్పటి సీమాంధ్ర ప్రభుత్వం అంగీకరించకపోవడంతో అతిథిగృహం నిర్మాణ పనులు ముందుకు సాగలేదు.
అప్పటి ఎమ్మెల్యే మహేందర్రెడ్డి, హోం శాఖ మంత్రి సబితారెడ్డి ప్రత్యేక చొరవతో ప్రభుత్వం నీటి పారుదల శాఖకు బదులుగా ఆర్ఆండ్బీ శాఖ ఆధ్వర్యంలో అతిథిగృహం భవన నిర్మాణానికి తీర్మానించింది. రూ.60 లక్షలతో భవన నిర్మాణం చేపట్టేందుకు ప్రతిపాదించారు. ఈ నిధులు రెండు సూట్లతో నిర్మించే అతిథిగృహం భవన నిర్మాణానికి సరిపోవని ఆర్ఆండ్బీ అధికారులు తేల్చి చెప్పడంతో మూడంతస్తులతో ఆరు సూట్లతో నిర్మాణానికి నీటి పారుదల శాఖ అధికారులు రూ.4 కోట్ల నిధుల మంజూరుకు ప్రతిపాదించగా ఆర్అండ్ బీ అధికారులు మాత్రం కనీసం రూ.2 కోట్ల నిధులైనా అవసరమని తేల్చి చెప్పింది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక మూడేండ్ల క్రితం ప్రస్తుత ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి మంత్రి హరిశ్రావుతో మాట్లాడి అతిథిగృహం నిర్మాణం కోసం రూ.2.54 కోట్లను విడుదల చేయించారు. నాలుగు సూట్లతో అతిథిగృహం నిర్మాణానికి నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో కాంట్రాక్టర్ ప్రసాద్ అతిథిగృహం పనులు ప్రారంభించి సగం పనులు పూర్తి చేశారు. కొన్నాళ్లకు కాంట్రాక్టర్ ప్రసాద్ అనారోగ్యంతో మృతి చెండంతో మూడేండ్లుగా అతిథిగృహం పనులు నిలిచి పోయాయి.
సగం పూర్తయిన అతిథిగృహం నిర్మాణం పనులు పూర్తి చేయడానికి సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ చూపకపోవడంతో అతిథిగృహం ప్రారంభానికి నోచుకోవడం లేదు. స్థానిక నేతలు, అధికారులు స్పందించి అర్ధంతరంగా నిలిచిన పనుల ప్రారంభానికి 60సి యాక్ట్ నామినేటెడ్ చేయడం లేదా మళ్లీ టెండర్ వేస్తే అనుకున్న విధంగా భవన నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉంటుందని సమాచారం.