మర్పల్లి, ఆగస్టు: అందరి సహకారంతోనే బాల్య వివాహాల నిర్మూలన సాధ్యమని జడ్పీటీసీ మధుకర్ అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో వెంకట్రామ్గౌడ్ అధ్యక్షతన మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో చైల్డ్ అడ్వైజరీ బోర్డు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ మధుకర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ దుకాణాల్లో 18ఏండ్ల లోపు పిల్లలను పనుల్లో పెట్టుకోవద్దని, ఆడ పిల్లలకు 18 ఏండ్లు, మగపిల్లలకు 21 ఏండ్లు నిండిన తరువాతనే వివాహాలు చేయాలని సూచించారు.
బాల్యవివాహాలు చేయడంవల్ల వచ్చే సమస్యలను ఆయన ఈ సందర్భంగా వివరించారు. బాలల సమస్యలను తెలిపేందుకు గ్రామాలలో గోడలపై టోల్ ఫ్రీ నంబర్1098ని రాయించేలా ఎంపీడీవో బాధ్యత తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ జ్యోతి, ఎంపీడీవో వెంకట్రామ్గౌడ్, ఆర్ఐ బాలు, చైల్డ్లైన్ ప్రతినిధులు శ్రీనివాస్, యాదయ్య, వార్డెన్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.