బొంరాస్పేట, ఆగస్టు : మండలంలోని రేగడిమైలారంలో అసురబలి సినిమా చిత్రీకరణ జరిగింది. సమాజంలోని చెడు వ్యక్తులు, చెడు అంశాలను రూపుమాపాలని, ఈ అంశాన్ని ప్రేక్షకులకు తెలియజేసేందుకు “అసురబలి” పేరుతో సినిమాను తెరెకెక్కిస్తున్నట్లు దర్శకుడు వినాయక్ మహదేవన్ తెలిపారు. శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం గ్రామంలోని పలు ప్రాంతాలలో సినిమాలోని పలు సన్నివేశాలను చిత్రీకరించారు.
సినిమాల ద్వారా సమాజంలోని చెడును తొలగించాలని చేస్తున్న ఈ ప్రయత్నం సఫలీకృతం అవుతుందన్నగట్టి నమ్మకం తనకుందన్నారు. నటనపై ఆసక్తి ఉండి నైపుణ్యమున్న నటులను పరిచయం చేస్తూ తక్కువ బడ్జెట్తో ఊహించని రీతిలో కథను అల్లి ప్రేక్షకుల మన్ననలు కచ్చితంగా పొందుతామని దర్శకుడు తెలిపారు.
సినిమా మొత్తం చిత్రీకరణను కొడంగల్ నియోజకర్గంలో పూర్తి చేస్తామని వినాయక్ మహదేవన్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం వెంకీవీణ, కో డైరెక్టర్, మాటలు అంజిలప్ప, కెమెరా శ్రీకాంత్, డీఐ శ్రీవాత్సవ, ప్రధాన పాత్రల్లో ఐశ్వర్య, సాయిచరణ్, నటీనటులు రాజేష్, పవన్, రాజు, కృష్ణయ్య, రమాదేవి, వెంకటేశం, జగ్జీవని, తిరుపతి నటిస్తున్నారు.