కేవలం మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, చాలా చోట్ల సంక్రాంతి పండుగ సందర్భంగా పతంగులు ఎగరేస్తూ వేడుకలు జరుపుకుంటారు. వీటిలో శ్రీలంక కూడా ఒకటి. ఇక్కడ థాయ్ పొంగల్ పండుగ సందర్భంగా రకరకాల ఆకృతులు, సైజుల్లో ఉండే గాలిపటాలు ఎగరేస్తూ, పోటీలు పెట్టుకుంటారు.
ఈ పండుగకు ఇదో ప్రత్యేక ఆకర్షణ కూడా. అందుకే ఈ పోటీల కోసం ఇప్పటి నుంచే చాలా మంది ప్రాక్టీస్ మొదలెట్టేస్తారు. ఇలాగే సోమవారం నాడు శ్రీలంకలోని జఫ్నాలో పాయింట్ పెడ్రోలో కొందరు యువకులు గాలిపటం ఎగరేస్తూ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆరుగురు యువకుల బృందం జనపనార తాడుతో గాలిపటాన్ని ఎగరేస్తున్నారు.
ఆ సమయంలోనే గాలిపటం బాగా గాల్లోకి లేచిన తర్వాత ఒక్కొక్కరే తాడు వదిలేశారు. కానీ ఒక వ్యక్తి మాత్రం పొరపాటున తాడు వదల్లేదు. దీంతో అతను కూడా గాల్లోకి లేచాడు. సుమారు 30 అడుగుల ఎత్తులో కేవలం గాలిపటం తాడు పట్టుకొని వేళ్లాడుతూ ఉండిపోయాడు. ఇలా నిమిషంపైగా అతను వేలాడుతుండగా, అతని స్నేహితులు కింద నుంచి తాడు వదిలేయాలంటూ కేకలు వేశారు.
గాలిపటం మరింత ఎత్తుకు లేచేలోగా అతను తాడు వదిలేసి కింద పడిపోయాడు. అదృష్టవశాత్తూ అతనికి ఎటువంటి గాయాలూ కాలేదు. ఈ ఘటన మొత్తం పక్కనే ఉన్న వాళ్లు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది బాగా వైరల్ అయిపోయింది.