టోక్యో: పాము కారణంగా సుమారు పది వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆ ప్రాంతం వాసులు సుమారు గంట వరకు ఇబ్బంది పడ్డారు. జపాన్ ఫుకుషిమాలోని కొరియామా సిటీలో ఈ సంఘటన జరిగింది. జూన్ 29న మిట్ట మధ్యాహ్నం 2.10 గంటలకు ఒక్కసారిగా నగరంలోని ఒక ప్రాంతంలో కరెంట్ పోయింది. దీంతో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ సిబ్బంది రంగంలోకి దిగారు. విద్యుత్ కేంద్రంలోకి పాము ప్రవేశించినట్లు గుర్తించారు. అది లైవ్ వైర్కు తగలడంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయినట్లు గమనించారు. షార్ట్ సర్క్యూట్ వల్ల వచ్చిన మంటలకు ఆ పాము కాలుతుండటాన్ని పరిశీలించారు.
కాగా, షార్ట్ సర్క్యూట్ వల్ల వచ్చిన పొగ, మంటలకు ఫైర్ అలారమ్ మోగింది. దీంతో ఆరు అగ్నిమాపక శకటాలు ఆ విద్యుత్ కేంద్రం వద్దకు చేరుకున్నాయి. అలాగే పాము లైవ్ వైర్కు తగలడంతో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఆ కేంద్రం షట్డౌన్ అయ్యింది. దీంతో విద్యుత్ను పునరిద్ధరించేందుకు సిబ్బందికి గంట సమయం పట్టింది. అయితే బాగా ఎండ ఉండగా మిట్ట మధ్యాహ్నం వేళ విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆ ప్రాంతంలోని సుమారు పది వేల ఇళ్ల నివాసితులు ఇబ్బంది పడ్డారు. కొందరు వ్యాపారులు తమ షాపులను మూసివేశారు.
మరోవైపు పాము వల్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు తెలుసుకున్న స్థానిక ప్రజలు ఆశ్చర్యపోయారు. పిడుగుపడి లేదా మరే ఇతర సాంకేతిక సమస్య వల్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడం సాధారణమని, అయితే పాము వల్ల ఇలా జరిగినట్లు తెలిసి షాకయినట్లు ఒక వ్యక్తి విమర్శించాడు. విద్యుత్ కేంద్రంలోకి పాములు వంటివి చొరబడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాడు. కాగా, షార్ట్ సర్క్యూట్ వల్ల పాము కాలి చనిపోవడంపై కొందరు నెటిజన్లు విచారం వ్యక్తం చేశారు. పాము కుటుంబానికి ఆ కంపెనీ నష్టపరిహారం చెల్లించాలంటూ ఒకరు హాస్యమాడారు.