ఉద్యోగం, వ్యాపారం.. ఈ రెండింటి మధ్య చాలామంది నలిగిపోతుంటారు. చాలామందికి ఏదైనా సొంతంగా వ్యాపారం చేయాలని ఉంటుంది కానీ.. దానికి తగ్గ సపోర్ట్ లభించదు. కొందరు మాత్రం రిస్క్ తీసుకోకుండా.. ఏదో దొరికిన ఉద్యోగం చేస్తూ తమ జీవితాన్ని వెళ్లదీస్తుంటారు.
కానీ.. ముస్తఫా పీసీ మాత్రం అలా అనుకోలేదు. తనకు చిన్నతనం నుంచే బిజినెస్ చేయాలనే కోరికే ఇప్పుడు వేల కోట్ల కంపెనీకి అధిపతిని చేసింది. కేరళకు చెందిన ముస్తఫా.. పేద కుటుంబం నుంచే వచ్చాడు. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబం వాళ్లది. తన తండ్రి.. ఎంత కష్టపడి కూలీ పని చేసినా మూడు పూటల తిండి దొరకని స్థితి.
6 వ తరగతిలో ముస్తఫా ఫెయిల్ అవడంతో.. చదువు మానేసి.. తన తండ్రితో పాటు కూలీపనులకు వెళ్లాడు ముస్తఫా. అప్పుడు ఇంటిల్లిపాది కష్టపడి పనిచేస్తే వచ్చే ఆదాయం.. రోజుకు 10 రూపాయలు. చదువు వద్దు.. ఇక మూడు పూటల తిండి తినాలన్నా కూలీ పనులను వెళ్లాలని అనుకున్న ముస్తఫాకు తన స్కూల్ టీచర్ చొరవతో మళ్లీ స్కూల్కి వెళ్లే అవకాశం దక్కింది. తన స్కూల్ టీచర్ తనకు ప్రత్యేకంగా ట్యూషన్లు కూడా చెప్పడంతో.. స్కూల్లో టాపర్గా నిలిచాడు ముస్తఫా. ఆ తర్వాత కష్టపడి పై చదువులు చదివి.. మంచి ఉద్యోగం సంపాదించాడు. తను సంపాదించిన మొదటి జీతం రూ.14,000 తన తండ్రి చేతుల్లో పెట్టాడు ముస్తఫా.
ఆ తర్వాత తన తండ్రి చేసిన అప్పులన్నింటినీ తీర్చేశాడు. రెండేళ్ల తర్వాత సొంతిళ్లు కొన్నాడు. విదేశాల్లో ఉద్యోగం చేసే అవకాశం రావడంతో అక్కడికెళ్లి ఉద్యోగం చేశాడు. కానీ.. తనకు ఉద్యోగం కన్నా.. బిజినెస్ చేయాలన్న లక్ష్యంతో ఐడీ ఫ్రెష్ ఫుడ్ అనే కంపెనీకి పునాది పడింది.
ముస్తఫా విదేశాల్లో ఉన్నప్పుడే.. నాణ్యమైన ఇడ్లీ, దోశ పిండిని తయారు చేసి అమ్ముదామని తన ఫ్రెండ్ చెప్పాడట. దీంతో.. వెంటనే తన సేవింగ్స్ నుంచి 50 వేల రూపాయలు ఇచ్చి.. ఐడీ ఫ్రెష్ ఫుడ్ అనే కంపెనీని స్థాపించారు. అయితే.. మొదట్లో కంపెనీని తన ఫ్రెండ్సే చూసుకునేవారు.
రోజుకు కనీసం 100 దోశ, ఇడ్లీ పిండి ప్యాకెట్లు అమ్మడానికి 9 నెలల సమయం పట్టింది వీళ్లకు.
కానీ.. వీళ్లు చేసిన కొన్ని తప్పిదాల వల్ల.. సేల్స్ మొత్తం పడిపోయాయి. అనుభవం లేని రంగం కావడంతో.. ఇడ్లీ, దోశ పిండి పులిసిపోవడంతో.. కస్టమర్లు వాళ్ల పిండిని కొనడం మానేశారు. దీంతో వెంటనే తన ఉద్యోగాన్ని మానేసి.. ముస్తఫా.. ఇండియా వచ్చేసి.. తన కంపెనీకి సీఈవో అయ్యాడు. తన దగ్గర ఉన్న డబ్బులన్నీ పెట్టాడు. చివరకు తన ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేకపోయాడు.
అలా.. 8 ఏళ్ల పాటూ.. ఎన్నో కష్టాలను చవి చూశాక.. చివరకు తన కంపెనీకి ఓ పెద్ద ఇన్వెస్టర్ దొరికారు. 2000 కోట్ల రూపాయలను ఐడీ ఫ్రెష్ ఫుడ్ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. దీంతో కంపెనీ రూపురేఖలే మారిపోయాయి. కంపెనీ పెద్దదయింది. సేల్స్ పెరిగాయి. తనతో పాటు మొదటి నుంచి ఉన్న 25 మంది ఉద్యోగులను లక్షాధికారులను చేశాడు ముస్తఫా. ఇప్పుడు తన కంపెనీలో వందల మంది పనిచేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : ఆ ఊళ్లో మహిళలకు ఒక భాష.. పురుషులకు మరో భాష.. ఒకే ఊరిలో రెండు భాషలు
అసలేంటి.. గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలర్టులు.. వీటిని వాతావరణ శాఖ ఎలా జారీ చేస్తుంది?
Bill Desk to Prorus | బిల్డెస్క్ త్రయం.. రూ.3,500 కోట్లకు అధిపతులు