Bill Desk to Prorus | ఆ ముగ్గురు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) గ్రాడ్యుయేట్లు).. కొంతకాలం ఓ సంస్థలో కన్సల్టెంట్లుగా పని చేశారు.
కానీ 2000వ మిలీనియం ప్రారంభంలో వారికో అద్భుతమైన ఆలోచన వచ్చింది. డిజిటల్ పేమెంట్స్ కంపెనీ ఏర్పాటు చేయాలనుకున్నారు. అంతే అర్టూర్ అండర్సన్ ఎల్లెల్పీ నుంచి బయటకొచ్చారు.
కేంద్ర ప్రభుత్వరంగ బ్యాంకు, ఆర్థిక సంస్థ దన్నుతో ముందుకు కదిలారు.. వారే ఈనాడు స్టార్టప్ బిల్ డెస్క్ వ్యవస్థాపకులు.. ఇటీవలే ఆ స్టార్టప్ను ప్రోసస్ ఎన్వీ 470 కోట్ల డాలర్లకు టేకోవర్ చేసింది.
ఆ ముగ్గురు బిల్ డెస్క్లో తమ వాటా 31 శాతం వదులుకున్నారు. ఒక్కొక్కరూ 500 మిలియన్ల డాలర్లు.. మన కరెన్సీలో రూ.3500 కోట్ల చొప్పున అందుకున్నారు.
మొత్తం వాటాలను ప్రోసస్కు విక్రయించినా.. మున్ముందు కూడా ఇదే బిజినెస్లో కొనసాగుతామని చెబుతున్నారు. అంతకు మించి వివరాలను వెల్లడించలేదు.
వారే ఎంఎన్ శ్రీనివాసు, అజయ్ కౌశల్, కార్తిక్ గణపతి.. సరిగ్గా 2000 జనవరి ఒకటో తేదీనే బిల్ డెస్క్ సేవలు ప్రారంభించారు. ఆర్టూర్ అండర్సన్ ఎల్లెల్పీలో ఫైనాన్సియల్ సర్వీసెస్లో అనుభవం గడించి 1999లో బయటకు వచ్చారు. తర్వాత మూడేండ్లకే ఈ సంస్థలో 2002లో ఎన్రాన్ కార్పొరేషన్ కుంభకోణం వెలుగు చూసిన సంగతి తెలిసిందే.
కానీ, సక్సెస్ ట్రాక్ కెరియర్ను వదులుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదుగుదామనుకున్నారు ఈ ముగ్గురు. అప్పట్లో వారి వద్ద పెద్దగా ఆదా చేసిన సొమ్ము కూడా లేదు.
వీరు ప్రారంభించిన బిల్ డెస్క్కు బ్యాంక్ ఆఫ్ బరోడా వెన్నుదన్నుగా నిలిచింది. అటుపై కేంద్ర ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సిడ్బీ) ఆర్థిక సాయం చేసింది.
ఆ తర్వాత 15 ఏండ్లకు టెమాసెక్ హోల్డింగ్స్, వీసా ఇంక్, జనరల్ అట్లాంటిక్ ఎల్లెల్సీ వంటి విదేశీ సంస్థల పెట్టుబడులు వచ్చాయి.
అమెజాన్ డాట్ కాం, మైక్రోసాఫ్ట్ లింక్డ్ ఇన్ సర్వీస్ సేవలందించింది. నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ల కొనుగోళ్లు, ఆపిల్ ఇంక్ ఆన్లైన్ స్టోర్ నిర్వహణ చేపట్టింది.
తద్వారా భారత్లో లక్షల మంది కస్టమర్లకు గ్లోబల్ గేట్వేను నిర్మించింది బిల్ డెస్క్.
ఈ ఏడాది ఐపీవో ద్వారా నిధుల సేకరణకు గల అవకాశాలపై కేంద్రీకరించింది. ఈలోగా బిల్డెస్క్ ఫౌండర్లను ప్రోసస్ సంప్రదించింది.. 100 శాతం షేర్లను కొనుగోలు చేయడానికి ఆఫర్ చేయడంతో బిల్ డెస్క్ నుంచి వారు బయటకు వచ్చేశారు.
2000లో 50 వేల మంది ఇంటర్నెట్ యూజర్లు ఉన్నప్పుడు బిల్డెస్క్ సేవలు మొదలయ్యాయి. ఇప్పుడు 80 కోట్ల మంది ఇండియన్లు ఇంటర్నెట్ వాడుతూ, ఈ-కామర్స్లో లావాదేవీలు నిర్వహిస్తున్నారు.