అయోధ్య: రామ మందిర నిర్మాణం కోసం విరాళల సేకరణ కార్యక్రమం శనివారంతో ముగిసింది. 44 రోజులపాటు సాగిన ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది విరాళాలు సేకరించారు. మొత్తంగా రూ.2 వేల కోట్ల వరకూ విరాళాలు వచ్చినట్లు ట్రస్ట్ అధికారులు వెల్లడించారు. అయితే ఇందులో ఇంకా చాలా వరకు డబ్బును ఇంకా బ్యాంకుల్లో డిపాజిట్ చేయాల్సి ఉన్నట్లు వాళ్లు తెలిపారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయితే.. విరాళాల మొత్తం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. విరాళాలుగా వచ్చిన మొత్తం సొమ్మును శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఖాతాల్లో జమ చేయనున్నారు.
మొత్తం డబ్బును లెక్కించి, ఆడిట్ ప్రక్రియను పూర్తి చేయడానికి మరో నెల రోజుల సమయం పడుతుందని అయోధ్య ట్రస్ట్ కార్యాలయం ఇన్చార్జ్ ప్రకాష్ గుప్తా వెల్లడించారు. ఈ ప్రక్రియను పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఓ యాప్ను రూపొందించారు. ఈ ప్రక్రియలో పాల్గొనే ప్రతి ఒక్కరికీ ఐడీ, పాస్వర్డ్ ఇచ్చామని, వారు ప్రతి రోజూ డేటాను అందులో నమోదు చేస్తారని గుప్తా చెప్పారు. 44 రోజుల పాటు సాగిన ఈ విరాళాల ప్రక్రియ దేశవ్యాప్తంగా 5 లక్షల గ్రామాల్లోని 11 కోట్ల కుటుంబాల్లో ఉన్న మొత్తం 55 కోట్ల మంది వరకూ చేరిందని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ చెప్పారు.