బెంగళూరు: తల్లి మరణంపై మనస్తాపం చెందిన ఒక వ్యక్తి రూ.1.3 కోట్ల ఖరీదైన బీఎండబ్ల్యూ కారును నదిలో పడేశాడు. విస్తూ పోయే ఈ సంఘటన కర్ణాటకలోని శ్రీరంగపట్నంలో జరిగింది. ఖరీదైన ఎర్ర రంగు కారు కావేరి నదిలో తేలడాన్ని సమీపంలోని గ్రామస్తులు, మత్స్యకారులు చూశారు. ఎవరైన ప్రమాదవశాత్తూ కారుతో సహా నదిలో పడిపోయి ఉంటారని అనుమానించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కూడా అలాగే అనుమానించి వెంటనే రెస్క్యూ సిబ్బందిని రంగంలోకి దింపారు. అయితే నదిలో తేలుతున్న కారు వద్దకు వెళ్లిన గజ ఈతగాళ్లు అందులో ఎవరూ లేరని చెప్పారు. చివరకు ఆ కారును నీటి నుంచి పైకి తీశారు.
అనంతరం కారు నంబర్ ఆధారంగా దాని యజమానిని పోలీసులు గుర్తించారు. బెంగళూరులో ఉంటున్న ఆ వ్యక్తిని శ్రీరంగపట్నానికి పిలిపించారు. కారు నదిలో పడటంపై ఆరా తీశారు. అయితే ఆయన పొంతన లేని సమాధానాలు చెప్పాడు. కారులో వెళ్తుండగా తనను చంపేందుకు బెంగళూరు నుంచి వాహనంలో ఫాలో అయ్యారని, వారి కంటపడకుండా ఉండేందుకు కారును నదిలోకి తోసేసినట్లు తెలిపాడు.
అయితే ఆ వ్యక్తి చెప్పేది నమ్మశక్యంగా పోలీసులకు అనిపించలేదు. దీంతో అతడి కుటుంబ సభ్యులను సంప్రదించారు. వారు అసలు విషయం చెప్పారు. నెల కిందట తల్లి మరణించడంతో అతడు మనస్తాపానికి గురైనట్లు తెలిపారు. ఆ బాధను తట్టుకోలేక కారును నదిలో పడేసి బెంగళూరులోని ఇంటికి తిరిగి వెళ్లాడని అన్నారు. దీంతో ఆయన మానసిక పరిస్థితిని అర్థం చేసుకున్న పోలీసులు ఎలాంటి జరిమానా విధించకుండా వదిలేశారు. మరోవైపు ఈ ఘటన అనంతరం ఆ వ్యక్తి చికిత్స కోసం జాతీయ మానసిక ఆరోగ్య ఆసుపత్రిలో చేరాడు.