బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ట్రాఫిక్ జామ్లు నిత్యకృత్యం. దీంతో ట్రాఫిక్ సమస్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతాయి. అయితే బెంగళూరులో ట్రాఫిక్ జామ్పై తాజాగా ఒక వ్యక్తి వినూత్నంగా విమర్శించాడు. అమ్మకానికి కారు గేర్లు ఉన్నాయంటూ ట్వీట్ చేశాడు. ‘బెంగళూరులో ఉన్న నా స్నేహితుడు తన కారులోని మూడు, నాలుగు, ఐదవ గేర్లను విక్రయించాలని ప్లాన్ చేస్తున్నాడు. అవి ఉపయోగించలేదు. షోరూమ్ కండీషన్లో ఉన్నాయి’ అని శ్రీకాంత్ అనే వ్యక్తి ఈ నెల 25న ట్విట్టర్లో ఒక పోస్ట్ చేశారు. బెంగళూరులో ఎవరైనా కొనేవారు ఉన్నారా? అని అందులో ప్రశ్నించారు. కారులోని మూడవ, నాల్గవ, ఐదవ గేర్లను బెంగళూరు రోడ్లపై వినియోగించాల్సిన అవసరం లేదంటూ పరోక్షంగా ఎద్దేవా చేశారు.
కాగా, ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పటికే ఎనిమిది వేల మంది దీనిని లైక్ చేశారు. నెటిజన్లు కూడా ఫన్నీగా కామెంట్లు చేశారు. అర్ధ రాత్రి 12 నుంచి ఉదయం 4 గంటల మధ్య ఆయన తన కారును నడపవచ్చుగా అని ఒకరు సూచించారు. అయితే ‘లక్షల్లో పన్నులు చెల్లించినా ఈ సమస్యపై ఆందోళనలు చేయలేకపోవడం చాలా బాధాకరం. ‘గర్వించదగిన పౌరుడు’గా ఉండాలంటే మనం నోరు మూసుకుని, ప్రశాంతంగా బాధపడాల్సిందే’ అని మరొకరు వ్యాఖ్యానించారు.
Any buyer in Bangalore? 🤔 pic.twitter.com/cWZreP06v7
— Shrikant 🇮🇳 (@sdjoshi55) May 25, 2022