నల్లగొండ, మే 2: నాగార్జునసాగర్లో టీఆర్ఎస్ గెలుపు బీజేపీ, కాంగ్రెస్లకు చెంపపెట్టులాంటిందని.. ప్రజలు సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారని మరోసారి రుజువైందని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండలోని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి నివాసంలో సాగర్ విజేత నోముల భగత్, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. దుబ్బాక గెలవగానే బీజేపోళ్లు ఎగిరెగిరి పడ్డారని.. సాగర్ గెలుపు బీజేపీకి చెంపపెట్టని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో జుగుప్సాకరంగా మాట్లాడిన కాంగ్రెస్, బీజేపీ నేతలకు అక్కడి ప్రజలు ఓటు రూపంలో సరైన జవాబిచ్చారన్నారు. 2014 నుంచి ఏ ఎన్నిక వచ్చినా 99 శాతం విజయాలు టీఆర్ఎస్నే వరించాయని చెప్పారు. కాంగ్రెస్నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిచ్చి మాటలు ఇకనైనా మానుకోవాలని హితవుపలికారు. తాను గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న జానారెడ్డి ఇప్పడు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖతమైందని, ఇక ఆ పార్టీ గతమేనన్నారు. కాంగ్రెస్ నేతల అరాచకాలను చూసిన ప్రజలు ఆ పార్టీని రాజకీయంగా సమాధి చేశారన్నారు.
తిరుగులేని విజయం: పల్లా రాజేశ్వర్రెడ్డి
సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నదని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ఒక్క సీటు గెలువంగనే.. బీజేపీ భూమి మీద ఆగలేదని.. రాష్ట్ర అధ్యక్షుడితో సహా చిల్లర మల్లరగా మాట్లాడారని విమర్శించారు. సాగర్ ప్రజలు విలక్షణమైన తీర్పు ఇచ్చారని, ఈ విజయం కోసం శ్రమించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికైనా బీజేపీ బుద్ధి తెచ్చుకొని ప్రవర్తించాలని సూచించారు. జానారెడ్డి ఏడుసార్లు గెలిచినా నియోజకవర్గానికి చేసిందేమీ లేదని ప్రజలకు తెలుసు కాబట్టే సరైన తీర్పు ఇచ్చారని తెలిపారు.
సీఎం అభివృద్ధే గెలిపించింది: నోముల భగత్
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సాగర్ నియోజకవర్గంలో నాన్న నర్సింహయ్య ద్వారా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే తన గెలుపునకు దోహద పడ్డాయని నోముల భగత్ చెప్పారు. ‘నాన్న చనిపోయిన తర్వాత సీఎం కేసీఆర్ తనపై నమ్మకం ఉంచి బీఫాం ఇస్తే.. అంతే విశ్వాసంతో సాగర్ ప్రజలు అక్కున చేర్చుకొని గెలిపించారు’ అని పేర్కొన్నారు. మంత్రి జగదీశ్రెడ్డి సహకారంతో నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడంతోపాటు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలుచేస్తానని చెప్పారు.
బూతులు తిట్టేవారికి కర్రుకాల్చి వాత : బడుగుల
ప్రచారంలో బూతులు తిట్టిన కాంగ్రెస్, బీజేపీ నాయకులకు సాగర్ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. అనేక మార్లు ప్రజాప్రతినిధులుగా గెలిచిన వారు సైతం స్థాయిని మరిచి నోటికొచ్చినట్టు మాట్లాడి వారి విలువను దిగజార్చుకున్నారని విమర్శించారు. అలాంటివారిని దూరం పెట్టిన ప్రజలు అభివృద్ధి వైపే అడుగులు వేశారన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, నలమోతు భాస్కర్రావు, చిరుమర్తి లింగయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మె ల్సీ పూల రవీందర్, నాయకులు తిప్పన విజయసింహారెడ్డి, ఎంసీ కోటిరెడ్డి, కటికం సత్తయ్యగౌడ్ పాల్గొన్నారు.