హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): కరోనా నియంత్రణలో తెలంగాణ అన్ని రాష్ర్టాల కంటే అగ్రభాగాన ఉన్నదని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. గతంతో పోలిస్తే రాష్ట్రంలో పరిస్థితులు గణనీయంగా మెరుగుపడ్డాయని తెలిపారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఏర్పాటైన రాష్ట్రస్థాయి టాస్క్ఫోర్స్ కమిటీ కీలక సమావేశం బుధవారం బీఆర్కే భవన్లో జరిగింది. ఈ సమావేశానికి కమిటీ చైర్మన్, మంత్రి కేటీఆర్ అధ్యక్షత వహించారు. సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు అన్ని కోణాల్లో పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అందరి సహకారంతో కరోనా గండం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో వైరస్ తీవ్రత తక్కువగా ఉన్నదని కేంద్రమంత్రి కూడా అంగీకరించారని చెప్పారు. అన్ని రాష్ర్టాల కంటే ఇక్కడ మెరుగైన వైద్య సదుపాయాన్ని అందిస్తున్నామని అన్నారు. నాలుగు పొరుగు రాష్ర్టాల నుంచి భారీ సంఖ్యలో వస్తున్న రోగులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఇతర రాష్ర్టాల రోగులకు హైదరాబాద్ కల్పతరువుగా మారిందన్నారు.
సమృద్ధిగా రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు
ఆక్సిజన్ నిల్వలపై డీఆర్డీవో అధికారులతో సమీక్షించామని మంత్రి కేటీఆర్ చెప్పారు. ప్రైవేట్ దవాఖానల్లో అవసరం లేకున్నా రెమ్డెసివిర్ ఇం జెక్షన్లు వాడుతున్నట్టు తెలిసిందన్న కేటీఆర్.. వా టిని అనవసరంగా వాడినా, బ్లాక్మార్కెటింగ్ చేసినా కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు 1.5 లక్షలు ఉన్నాయని తెలిపారు. వీటిని తయారుచేస్తున్న కంపెనీలతో సమన్వయం చేసుకుంటున్నామని చెప్పారు. దవాఖానల్లో రెమ్డెసివిర్ వినియోగం పై వివరాలు సేకరిస్తున్నామని, వాటిపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు.
బ్లాక్ ఫంగస్పై అలర్ట్
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఏర్పాటుచేసిన టాస్క్ఫోర్స్ ఎప్పటికప్పుడు కొవిడ్ పరిస్థితిని సమీక్షిస్తున్నదని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోగులకు అవసరమైన సహాయాన్ని అందిస్తున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. కొందరు రోగులకు అత్యవసరంగా వాడుతున్న టోసిలిజుమాబ్ వంటి మందుల సరఫరా కూడా సరిపడేలా చూసుకోవాలని సూచించామని తెలిపారు. బ్లాక్ ఫంగస్ వ్యాధి విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉన్నదని మంత్రి చెప్పారు. ఆ వ్యాధి నివారణకు అవసరమైన మందులను ప్రభుత్వం సేకరిస్తున్నదని తెలిపారు.
బెడ్ల సంఖ్య, ఆక్సిజన్ సరఫరా పెంచాం
లాక్డౌన్ కాలంలో వైరస్ను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. ప్రజల సహకారంతో వైరస్ త్వరలోనే అదుపులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 9 నెలలకు సరిపడే విధంగా ఆక్సిజన్ నిల్వలు ఉంచుతున్నామని తెలిపారు. ఆక్సిజన్ నిల్వలను 400% పెంచామని అన్నారు. పెరుగుతున్న రోగులకు అనుగుణంగా రాష్ట్రంలో 54వేల వరకు బెడ్లను సిద్ధం చేశామని చెప్పారు. రాష్ట్రంలోని 1200 చిన్న, పెద్ద ప్రైవేట్ దవాఖానల్లో ఔషధాల కొరత, ఆక్సిజన్ ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ఒకే హెల్ప్లైన్
కొవిడ్ రోగుల కోసం ఏర్పాటుచేసిన హెల్ప్లైన్ నంబర్ రాష్ట్రవ్యాప్తంగా ఒకటే ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించామని మంత్రి కేటీఆర్ చెప్పారు. జిల్లాల్లో కొవిడ్ నియంత్రణ చర్యల పర్యవేక్షణకు మంత్రులు ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని తెలిపారు. మంత్రులతో అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించామన్నారు.
10 లక్షల మందికి రెండు డోస్ల టీకా పూర్తి
రాష్ట్రంలో 45 ఏండ్లు దాటినవారు 92 లక్షల మంది ఉన్నారని, వీరిలో ఇప్పటికే 38 లక్షల మంది మొదటి డోసు టీకా తీసుకున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. వీరిలో 7.15 లక్షల మంది సాధారణ ప్రజలు, మూడు లక్షల మంది ఫ్రంట్లైన్ వారియర్స్ రెండు డోసులు తీసుకున్నారని వివరించారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ కొరతను అధిగమించేందుకు కూడా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. త్వరలోనే హైదరాబాద్లోని వ్యాక్సిన్ తయారీ కంపెనీలతో సమావేశమవుతామని తెలిపారు. ప్రభుత్వం ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. టాస్క్ఫోర్స్ సమావేశంలో రాష్ట్రంలో పరిస్థితిపై సుదీర్ఘంగా చర్చించామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, పరిశ్రమలు, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్, జీఏడీ ముఖ్యకార్యదర్శి వికాస్రాజ్, పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, సీఎంవో కార్యదర్శి, కొవిడ్ ప్రత్యేకాధికారి రాజశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.