ఇచ్చోడ: మనస్సు ఉంటే మార్గముంటుందని, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను చిత్తశుద్ధితో అమలు చేస్తే అద్భుతాలు సృష్టించవచ్చని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా (కే) గ్రామ పంచాయతీ నిరూపిస్తోంది. పంచాయతీ ఆవరణ మొత్తం పచ్చదనంతో కళకళలాడుతుండడంతో ఆ గ్రామ పంచాయతీపై ట్విట్టర్లో రోజురోజుకూ ప్రశంసలు కురుస్తునే ఉన్నాయి. తాజాగా గ్రీన్ బిల్డింగ్ అంటూ శనివారం రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ట్విట్టర్లో వీడియో పోస్ట్ చేసి, ప్రశంసలు కురిపించారు. ముక్రా (కే) గ్రామస్తులు గ్రీన్ ఇండియాను చాలెంజ్గా తీసుకుని పనిచేస్తుండడాన్ని ఆయన కొనియాడారు. గ్రామంలో ఇటీవల కొత్తగా రూ. 25 లక్షల నిధులతో గ్రామపంచాయతీ భవనాన్ని నిర్మించారు.
జీపీ బిల్డింగ్ చుట్టూ ప్రహరీకి రూ.5 లక్షల నిధులు మంజూరు చేయాలనీ గ్రామ సర్పంచ్ గాడ్గె మీనాక్షి, ఎంపీటీసీ గాడ్గె సుభాశ్ ఎంపీ సంతోష్ కుమార్ను కోరారు. వారి అభ్యర్థన మేరకు రూ.5 లక్షల నిధులను విడుదల చేశారు. జీపీ చుట్టూ ప్రహరీ, ఆవరణలో బృందవనాన్ని తలిపించే విధంగా మొత్తం పచ్చ గడ్డిని నాటారు. అతిథులు కూర్చోడానికి ఎనిమిది బెంచీలు ఏర్పాటు చేశారు. గ్రామంలో పచ్చదనం పెంపొందించడం కోసం సర్పంచ్, ఎంపీటీసీ, పాలక వర్గం, గ్రామస్తులు తీసుకుంటున్న చర్యలు భేష్ అంటూ ట్విట్టర్లో ప్రశంసించారు.