న్యూఢిల్లీ, జూన్ 1: కరోనా పరిస్థితుల దృష్ట్యా సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం మంగళవారం నిర్ణయించింది. విద్యార్థుల మేలు కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రధాని మోదీ తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో ఆందోళన ఇక తొలిగిపోవాలన్నారు. ప్రధాని అధ్యక్షతన నిర్వహించిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పరీక్షలను రద్దు చేయడంతో 12వ తరగతి విద్యార్థుల ఫలితాల ప్రకటనకు నిర్దిష్ట ప్రమాణాలను రూపొందించాలని సీబీఎస్ఈకి సూచించారు. ‘12వ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విస్తృతమైన సంప్రదింపుల అనంతరం విద్యార్థులకు అనుకూలమైన, వారి ఆరోగ్యాన్ని, భవిష్యత్తును కాపాడే నిర్ణయం తీసుకున్నాం’ అని సమావేశం తర్వాత మోదీ ట్వీట్ చేశారు. ఇప్పటికే సీబీఎస్ఈ 10వ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేసింది. దీంతో ఈ ఏడాది సీబీఎస్ఈ ఏ పరీక్షలనూ నిర్వహించనట్టయింది. సీబీఎస్ఈ బాటలోనే సీఐఎస్సీఈ కూడా 12వ తరగతి పరీక్షలను రద్దు చేసింది.
మార్కులు ఎలా వేస్తారు?
12వ తరగతి పరీక్షలు రద్దు కావడంతో ప్రత్యామ్నాయ మూల్యాంకన పద్ధతిని ఖరారు చేయవలసి ఉంది. 12వ తరగతి విద్యార్థులు 9, 10, 11 తరగతుల్లో సాధించిన మార్కుల వివరాలను పంపాలని పాఠశాలలను సీబీఎస్ఈ కోరినట్టు సమాచారం. దీన్ని బట్టి గత మూడేండ్లలో ప్రదర్శించిన ప్రతిభను ప్రామాణికంగా తీసుకునే అవకాశముందని భావిస్తున్నారు. 10వ తరగతి విద్యార్థులకు మార్కుల కేటాయింపులో ప్రీ-బోర్డు, మిడ్-టెర్మ్, పీరియాడిక్ పరీక్షలను ప్రాతిపదికగా తీసుకోవాలని పాఠశాలలను సీబీఎస్ఈ ఆదేశించింది. గరిష్ఠ వెయిటేజీ ప్రీ-బోర్డు పరీక్షలకు ఇస్తారు. ఏడాదిలో ఏవైనా పరీక్షలకు హాజరుకాని 10వ తరగతి విద్యార్థుల అసెస్మెంట్ను ఫోన్లో చేయాలని సూచించింది. ఇక 12వ తరగతి విద్యార్థులు ఎవరైనా పరీక్షలు రాయాలనుకుంటే వారికి సీబీఎస్ఈ అవకాశం కల్పించాలని కూడా మంగళవారం నాటి సమావేశంలో నిర్ణయించారు. అనువైన పరిస్థితులు ఏర్పడినప్పుడు పరీక్షలు నిర్వహిస్తారు.ఇదిలాఉండగా సీబీఎస్ఈ నిర్వహించే బోర్డు పరీక్షలను పూర్తిగా రద్దు చేయడం ఇదే మొదటిసారి. కరోనా ముప్పుతో గత ఏడాది లాక్డౌన్ ప్రకటించేసరికి కొన్ని పరీక్షలు పూర్తయ్యాయి. తర్వాత మిగతా పరీక్షలను రద్దు చేశారు.
తెలంగాణలోనూ ఇంటర్ పరీక్షలు రద్దు?
సీబీఎస్ఈ తరహాలో తెలంగాణలో ఇంటర్ సెకండియర్ పరీక్షలు రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీబీఎస్ఈ పరీక్షలపై కేంద్రం మంగళవారం నిర్ణయాన్ని ప్రకటించడంతో రాష్ట్ర ఇంటర్బోర్డు అధికారులు సైతం పరీక్షల రద్దు ఆలోచన చేస్తున్నారు. ఈ ఏడాది 5.75 లక్షల మంది విద్యార్థులు సెకండియర్ పరీక్షకు హాజరవుతారని అంచనా. ఈ విద్యార్థులను ఉత్తీర్ణులను చేసే అంశంపై రెండురకాల ప్రత్యామ్నాయాలను బోర్డు పరిశీలిస్తున్నది. ఫస్టియర్ మార్కుల ఆధారంగా మార్కులేయడం, లేదంటే అందరినీ ఉత్తీర్ణులు చేసే అంశాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం.