Vijay Sai Reddy | హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారమే లక్ష్యంగా అమలుచేయలేని హామీలు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి ఏనాడూ లేదని, అయినా ఇప్పుడు దాన్ని ఎన్నికల అంశంగా మార్చాలని చూస్తున్నదని విమర్శించారు. రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ఆయన మాట్లాడారు. ‘కాంగ్రెస్ పార్టీ ఏపీకి విలన్. ఏపీకి పదేండ్లు ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధాని మన్మోహన్సింగ్ రాజ్యసభలో కచ్చితంగా చెప్పారు. అది కంటితుడుపు హామీ అయ్యింది.
ఏపీపై కాంగ్రెస్కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే విభజన చట్టంలో ప్రత్యేక హోదా ఎందుకు పెట్టలేదు? ఏపీ కాంగ్రెస్ ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ అర్థంపర్థం లేకుండా మాట్లాడుతున్నారు. 2004లో తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్, పదేండ్ల తర్వాత అశాస్త్రీయంగా రాష్ర్టాన్ని విభజించింది. కుటుంబ వ్యవహారంలో తల దూర్చడం కాంగ్రెస్ డర్టీ పాలిటిక్స్కు నిదర్శనం. గత ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్కు నోటా కంటే తక్కువ ఓట్లు పార్టీకి వచ్చాయి. కాంగ్రెస్ దుష్ట పరిపాలనకు ఏపీ పెద్ద బాధిత రాష్ట్రం. జాతీయస్థాయిలో కూడా కాంగ్రెస్ కనుమరుగు కావడం ఖాయం. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు 40 సీట్లకు మించి రావు. 2029 నాటికి కాంగ్రెస్ ముక్త భారత్ తథ్యం’ ధ్వజమెత్తారు.