మహబూబ్ నగర్ : నిరుద్యోగ యువత రాబోయే ఆరు నెలల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండి సీరియస్గా ప్రిపరేషన్ పూర్తి చేసి ఉద్యోగాలు సాధించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. సోమవారం మహబూబ్నగర్ పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న ఎక్స్పో ప్లాజా వద్ద టీఆర్ఎస్ పార్టీ జెండాను మంత్రి శ్రీనివాస్ గౌడ్ , కేటీఆర్తో కలిసి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆవిష్కరించారు.
అనంతరం ఎక్స్పో ప్లాజాలో శాంతా నారాయణ గౌడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్లో ఉద్యోగార్థులకు కేటీఆర్ పోటీ పరీక్షల పుస్తకాలను అందజేసారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ పట్టణం పూర్తి స్థాయిలో వేగంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి మేరకు మహబూబ్ నగర్ పట్టణానికి అవసరమైన నిధులు మున్సిపల్ శాఖ ద్వారా మంజూరు చేస్తామని ఆయన వెల్లడించారు. పట్టణ అభివృద్ధికి అవసరమైన మేర తమ సహకారం ఉంటుందని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సుమారు 90 వేల ఉద్యోగాలను భర్తీ చేసే ప్రక్రియ చేపట్టారని తెలిపారు.
కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు ఇంతియాజ్, వాల్యా నాయక్, వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.