జైపూర్, ఏప్రిల్ 25: ప్రేమపేరిట వేధిస్తున్నాడంటూ ఓ యువకుడిని యువతి కుటుంబ సభ్యులు దారుణంగా హత్యచేశారు. అందరూ చూస్తుండగానే కత్తి, బండరాళ్లతో విచక్షణారహితంగా దాడిచేసి హతమార్చారు. ఈ ఘటన మంగళవారం ఉదయం మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్స్టేషన్ పరిధి ఇందారంలో చోటుచేసుకున్నది. ఇందారం గ్రామానికి చెందిన పెద్దపల్లి కనకయ్య-పద్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. పెద్దకూతురు శ్రుతికి గతేడాది మే 25న సీసీసీ నస్పూర్కు చెందిన శివతో పెండ్లి చేశారు. అయితే.. వివాహానికి ముందే శ్రుతికి అదే గ్రామానికి చెందిన లారీడ్రైవర్ మహేశ్(24)తో పరిచయముంది. వివాహం అనంతరం శ్రుతిపై కక్ష పెంచుకున్న మహేశ్.. ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. ఆమె భర్తకు కూడా పంపించాడు.
యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మహేశ్ కొంతకాలం జైలుకెళ్లొచ్చాడు. ఈ విషయమై మనోవేదనకు గురైన శ్రుతి భర్త శివ విడాకులు తీసుకున్నాడు. కొంతకాలం తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో శ్రుతి కుటుంబ సభ్యులతో మహేశ్కు పలుమార్లు గొడవలు జరిగాయి. ఇరుకుటుంబాలపై కేసులు కూడా నమోదయ్యాయి. తాజాగా.. మంగళవారం శ్రుతి ఇంటి ముందు నుంచి మహేశ్ వెళ్తుండగా ఆమె సోదరుడు సాయికి, మహేశ్కు గొడవ జరిగింది. ఈ క్రమంలో శ్రుతి తండ్రి కనకయ్య, తల్లి పద్మ కలిసి మహేశ్పై కత్తితో, బండరాయితో దాడిచేసి హత్య చేశారు. విషయం తెలుసుకున్న జైపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగానే.. మహేశ్ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. జైపూర్ ఏసీపీ నరేందర్, శ్రీరాంపూర్ సీఐ రాజు వారికి నచ్చజెప్పడంతో శాంతించారు.