పెనుబల్లి, ఏప్రిల్ 2 : పొలం వద్దకు విద్యుత్ మోటర్ ఆఫ్ చేయడానికి వెళ్లిన రైతు పాము కాటుకు(Snake bite) గురై మృతి చెందాడు(Farmer died). ఈ విషాదకర ఘటన ఖమ్మం(Khammam) జిల్లా పెనుబల్లి మండలం పార్థసారథిపురం గ్రామంలో మంగళవారం ఉదయం వెలుగుచూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన యువ రైతు కుంజా శివ(30) తనకున్న నాలుగెకరాల్లో వరి పంట సాగు చేస్తున్నాడు.
ఈ క్రమంలో సోమవారం రాత్రి పంటకు నీరందించే విద్యుత్ మోటర్ను బంద్ చేసేందుకు పొలం వద్దకు వెళ్లాడు. అక్కడ మోటర్ ఆఫ్ చేస్తుండగా శివను పాము కాటు వేసింది. దీంతో అనుమానం వచ్చిన శివ తన సెల్ఫోన్ లైట్ ఆధారంగా చుట్టుపక్కల వెతకగా.. రక్తపింజర పాము కనిపించగా వెంటనే దానిని చంపేశాడు. తిరిగి శివ ఇంటికి వచ్చే క్రమంలో స్పృహ తప్పి పడిపోయి అక్కడే మృతిచెందాడు.
అయితే రాత్రి శివ ఇంటికి రాకపోవడంతో మంగళవారం తన మేనకోడలు పెళ్లి ఉండడంతో అక్కడికి వెళ్లి ఉంటాడని కుటుంబ సభ్యులు భావించారు. మంగళవారం ఉదయం వరకు శివ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. పెళ్లి కుమార్తె ఇంటికి వెళ్లి వెతకగా.. అక్కడికి రాలేదని చెప్పారు. పొలం వద్ద ఉన్నాడనే అనుమానంతో అక్కడికి వెళ్తుండగా మార్గమధ్యలో శివ మృతిచెంది ఉండటాన్ని కుటుంబ సభ్యులు గమనించారు. మృతుడు శివకు భార్య, కూతురు ఉన్నారు.