మల్యాల, జనవరి 24: జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని నూకపల్లి సహకార సంఘానికి 1,800 యూరియా బస్తాలు చేరాయి. మంగళవారం ఉదయం 450 యూరియా బస్తాలు రాగా, ఒక్కో రైతుకు రెండు బస్తాలు మాత్రమే ఇవ్వడంతో చాలామంది రైతులు నిరాశతో వెనుదిరిగారు. ఈ నేపథ్యంలో ‘యూరియా పరేషాన్’ శీర్షికన బుధవారం ‘నమస్తే తెలంగాణ’లో కథనం ప్రచురితమైంది. దీంతో అధికారులు కదిలారు.
బుధవారం ఉదయమే హుటాహుటిన మార్క్ఫెడ్ డీఎం దివ్యభారతి, డీఏవో సురేశ్కుమార్, జిల్లా సహకార అధికారి సత్యనారాయణ సొసైటీకి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. 4 లారీల్లో 1,800 బస్తాలను సహకార సంఘానికి పంపించారు. జిల్లా సహకార అధికారి సత్యనారాయణ దగ్గరుండి మరీ రైతులకు యూరియా పంపిణీ చేయించారు. సాయంత్రం వరకు 550 బస్తాలు రైతులకు విక్రయించగా 1,250 బస్తాలను అందుబాటులో ఉంచారు.
యాసంగి ఎరువులు సిద్ధం: డైరెక్టర్
యాసంగి సీజన్కు అవసరమైన ఎరువులు సిద్ధంగా ఉంచామని వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి తెలిపారు. యూరియా కొరతపై ‘యూరియా పరేషాన్’ శీర్షికన నమస్తే తెలంగాణలో ప్రచురితమైన కథనంపై స్పందించిన డైరెక్టర్ ఈ మేరకు వివరణ ఇచ్చారు. ఈ సీజన్కు 19.24 లక్షల టన్నుల మేరకు వివిధ రకాల ఎరువులతో ప్రణాళికను సిద్ధం చేశామని, గ్రామీణ స్థాయి వరకు ఎరువులను చేరవేసినట్టు తెలిపారు. అన్ని స్థాయిల్లో ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను డైరెక్టర్ గోపి ఆదేశించారు. ఎక్కడ కూడా జీరో స్టాక్ ఉండొద్దని హెచ్చరించారు.
సెర్ప్ ఉద్యోగులకు వేతనాలు జమ
నమస్తే తెలంగాణలో బుధవారం ప్రచురితమైన ‘23 తారీఖొచ్చినా జీతాలు పడలే’ కథనానికి ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు అధికారులు ఆగమేఘాలపై రాష్ట్రంలోని సుమారు 5 వేల మంది గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఉద్యోగుల వేతనాలను సాయంత్రం నాటికి వారి ఖాతాల్లో జమ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ మొదటి వారంలోనే వేతనాలు ఇచ్చామని చెప్పుకున్న ప్రభుత్వం వేలాది మంది సెర్ప్ ఉద్యోగుల జీతాల విడుదల విషయంలో జాప్యాన్ని నమస్తే తెలంగాణ వెలుగులోకి తీసుకొచ్చింది. దీంతో సాయంత్రంకల్లా ఉద్యోగుల ఫోన్లకు బ్యాంకుల నుంచి వేతనాలు జమ అయిన మేసేజ్లు వచ్చాయి. ఉద్యోగులకు రూ.19 కోట్ల వరకు వేతనాలు రూపంలో చెల్లించినట్టు సమాచారం.