Crop Bonus | హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): రైతుల నుంచి ప్రభుత్వం యాసంగి ధాన్యం కొనుగోలు చేసి రెండు నెలలు కావొస్తున్నది. అయితే, ఇప్పటివరకు సన్నధాన్యం విక్రయించిన రైతులకు చెల్లించాల్సిన బోనస్ నయా పైసా ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తుందో కూడా ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. బోనస్ కింద రైతులకు రూ.700 కోట్లకుపైగా చెల్లించా ల్సి ఉన్నది. రైతులు బోనస్ పైసల కోసం ఎదురుచూస్తున్నారు.
వానకాలం సాగు మొదలవుతున్నా యాసంగిలో బకాయి ఉన్న మూడో విడత రైతుభరోసాతోపాటు యాసంగి ధాన్యం బోనస్ పైసల విషయంలో ప్రభుత్వం స్పం దించడంలేదు. బోనస్ విడుదలకు సంబంధించి ఇప్పటివరకు చర్యలు చేపట్టలేదని తెలిసింది. దీంతో ఈ యాసంగిలోనూ సన్నధాన్యం బోనస్ వస్తుందా? లేదా? అనే అనుమానాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ యాసంగిలో ప్రభుత్వం ఇప్పటివరకు 73 లక్షల టన్నుల ధాన్యం సేకరించింది. ఇందులో 59 లక్షల టన్నులు దొడ్డు ధాన్యం కాగా, 14 లక్షల టన్నుల సన్నధాన్యం ఉన్నది. టన్నుకు రూ.5వేల చొప్పున బోనస్ కింద రైతులకు రూ.700 కోట్లకుపైగా చెల్లించాల్సి ఉన్నది. కానీ, ఇప్పటివరకు ఒక్క రైతుకు కూడా నయా పైసా చెల్లించలేదు.
ధాన్యానికి సంబంధించిన మద్దతు ధర పైసలను సివిల్సైప్లె కార్పొరేషన్ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని రైతులకు చెల్లిస్తున్నది. బోనస్కు సంబంధించిన నిధులను సివిల్సైప్లె శాఖ నుంచి చెల్లించాల్సి ఉన్నది. ఇందుకు ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి నిధుల విడుదలపై ఎలాంటి హామీ లభించలేదని తెలిసింది. శాఖ నుంచి ఫైల్ ప్రభుత్వానికి చేరినప్పటికీ, దీనిపై నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఈ నేపథ్యంలో బోనస్ విడుదలపై సివిల్ సైప్లె శాఖ అధికారులు చేతులెత్తేస్తున్నారు. సర్కార్ నుంచి నిధులు వస్తేగానీ తామేం చేయలేమని చెప్తున్నారు. ఇదిలా ఉంటే మద్దతు ధర నిధులు కూడా పూర్తిగా విడుదల కావడంలేదు. రైతులకు 73 లక్షల టన్నులకుగాను సుమారు రూ.17,500 కోట్లు చెల్లించాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.14వేల కోట్లు చెల్లించినట్టు తెలిసింది. అంటే ఇంకా రూ.3,500 కోట్లు బకాయి ఉండటం గమనార్హం.
మరో సీజన్ బోనస్కు ఎగనామమేనా?
సన్న ధాన్యానికి ఒక సీజన్లో బోనస్ ఇస్తే, మరో సీజన్లో ఎగవేయడం కాంగ్రెస్ సర్కార్కు అలవాటుగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే గత యాసంగి బోనస్ను ప్రభుత్వం ఎగవేసింది. గత యాసంగిలో 4 లక్షల మంది రైతుల నుంచి 23.19 లక్షల టన్నుల సన్న ధాన్యం కొనుగోలు చేసింది. ఇందుకుగాను రైతులకు బోనస్ కింద రూ.1,159.64 కోట్లు చెల్లించాల్సి ఉన్నది. దాదాపు ఏడాది గడుస్తున్నా ఇప్పటివరకు గత యాసంగి బోనస్ నిధులను రైతులకు ఇవ్వలేదు. దీంతో ఈ యాసంగిలోనూ తమకు రావాల్సిన బోనస్ డబ్బులను సర్కార్ ఎగవేస్తుందేమోనన్న ఆందోళన రైతులను వెంటాడుతున్నది.