మెదక్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నదని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ యాదగిరిగుట్ట ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు. అదే తరహాలో ఏడుపాయల వనదుర్గామాత ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేసినట్టు చెప్పారు. ఏడుపాయలకు నిధులు మంజూరు చేసినందుకు బుధవారం ఆలయ ప్రాంగణంలో దుర్గామాతకు ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి పూజలు చేశారు. అనంతరం 21 బోనాలు సమర్పించి అమ్మవారికి ఒడిబియ్యం పోశారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఈ నిధులతో ఏడుపాయల్లో కాటేజీల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనతోపాటు ఆలయ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు తెలిపారు. ఏడుపాయల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని చెప్పారు.