Yadagirigutta | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు బుధవారం ఉదయం శ్రీరామ అలంకారంలో హనుమంత వాహన సేవపై యాదగిరి శ్రీలక్ష్మీ నరసింహాస్వామి వారు ఆలయ తిరు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. నయన మనోహరంగా స్వామివారు అలంకార సేవపై ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు.
లోక కల్యాణం కోసం స్వామివారు వివిధ అవతారాలు ఎత్తారని ఈ సందర్భంగా అర్చకులు ఉపదేశించారు. ప్రత్యేకంగా తెప్పించిన పూలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. వేద మంత్రలు, వేదపారాయణలు, మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా స్వామి వారి ఊరేగింపు సేవ పై ఊరేగారు. రాత్రి స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. దీనికోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉత్తర మాడవీధుల్లో ప్రత్యేకమైన కల్యాణ వేదికను సిద్ధం చేశారు. వీవీఐపీ, వీఐపీ, ఇతర భక్తులు స్వామి వారి కల్యాణాన్ని వీక్షించే విధంగా ప్రత్యేకమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. కొండపైన పలు ప్రాంతాల్లో ఎల్ ఈ డీ స్క్రీన్లను ఉంచారు. ఈ సేవలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఆలయ భవానీ శంకర్, ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహ మూర్తి, డీఈవో భాస్కర్ శర్మ, ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, భట్టర్ సురేంద్రాచార్యులు, ఆలయ అధికారులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.