యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బాలాయంలో బుధవారం పవిత్రోత్సవాలు పంచరాత్రగమ శాస్త్ర రీతిలో జరిగాయి. స్వామి వారి బాలాలయ మహా మండపంలో ఉత్సవమూర్తులకు అర్చకులు తిరుమంజనాలు నిర్వహించారు. స్వామి వారిని పట్టువస్ర్తాలు, బంగారు, ముత్యాల ఆభరణాలతో ఆలంకరించి 108 నూలు ధారాలతో తయారు చేసిన పవిత్ర మాలలను పుణ్య జలాలతో సంప్రోక్షించి పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారికి శాంతి హోమం చేప ట్టారు. స్వామి, అమ్మవార్లకు మూల, ముక్తి మంత్రాలు, వేదమంత్ర పఠనాలతో హవన పూజలు చేశారు.
పూర్ణాహుతి పర్వాలను నిర్వహించి పవిత్ర మాలలను బాలాలయం చుట్టూ ప్రదక్షిణ జరిపి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మూర్తికుంభ ఆరాధన, పవిత్రమాలల ఆరాధనలు జరిపి పవిత్ర మాలలను కవచమూర్తులకు అలంకరిచారు. మూడు రోజులు పాటు కొనసాగే పవిత్రోత్సవాలను గురువారం ప్రధా నాలయంలోని స్వయంభూవులకు పవిత్రధారణ, బాలాలయంలోని యాగళాలలో మహాపూర్ణహుతి హోమంతో ఉత్సవాలకు పరిసమాప్తి పలుకనున్నారు.
పాతగుట్టలో..
పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ఆలయంలో హవనం, హోమం, అర్చనలు వంటి పూజాపర్వాలు చేపట్టారు. నూలుపోగులతో తయారు చేసిన పవిత్రమాలలకు యాగశాలలో పూజలు నిర్వహించి, స్వయంభూ మూర్తులకు వేశారు. సాయంత్రం వేళలో ఆలయ గోపురం మీదగల సుదర్శనచక్రానికి పవిత్రధారణ గావించారు.