యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి దివ్య క్షేత్రంలో ఆదివారం నిత్య పూజల కోలాహలం నెలకొంది. తెల్లవారు జాము మూడు గంటల నుంచి ఆర్జిత పూజలు మొదలయ్యాయి. సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు నిజాషేకాలతో స్వామి వారి నిత్యారాధనలు ప్రారంభించారు. హారతి నివేదనలు అర్పించారు. సుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. ప్రతిరోజూ నిర్వహించే నిత్య కల్యాణోత్సవంలో భక్తులు పాల్గొని స్వామి వారి కల్యాణ తంతును వీక్షించారు.
దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి. సాయంత్రం వేళ అలంకార జోడు సేవలు నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు. శ్రీపర్వతవర్ధనీ సమేత రామలింగేశ్వరుడికి రుద్రాభిషేకం జరిపారు. నవ గ్రహాలకు తైలాభిషేకం జరిపారు. అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. శ్రావణమాసం సందర్భంగా సత్యనారాయణ వ్రతాలు భారీగా జరిగాయి. భక్తులు వ్రతమాచరించి స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.