Telangana Budget | నల్లగొండ జిల్లా దామరచర్లలో టీఎస్ జెన్ కో నిర్మిస్తున్న 4 వేల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్ పనులు చివరిదశకు వచ్చాయని ఆర్థిక మంత్రి హరీశ్రావు తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈ ప్లాంటు నుంచి కూడా ఉత్పత్తి ప్రారంభమవుతుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను అని హరీశ్రావు తెలిపారు.
భద్రాద్రిలో 1080 మెగావాట్ల సామర్థ్యంతో 4 యూనిట్లలో ఉత్పత్తి ప్రారంభమైందని హరీశ్రావు పేర్కొన్నారు. 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన కొత్తగూడెం విద్యుత్ ప్లాంటులోనూ ఉత్పత్తి ప్రారంభమైంది. మంచిర్యాల జిల్లా జైపూర్లో 1200 మెగావాట్ల సామర్థ్యంతో సింగరేణి నిర్మించిన విద్యుదుత్పత్తి కేంద్రంలోనూ ఉత్పత్తి ప్రారంభమైంది. దీనికి అదనంగా 8,085 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి అని హరీశ్రావు తెలిపారు.
అన్నిరంగాలకూ 24 గంటలపాటు నిరంతరాయంగా, వ్యవసాయానికి ఉచితంగా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి స్పష్టం చేశారు. వెలుగు జిలుగుల రాష్ట్రంగా తెలంగాణ కీర్తి నేడు దశదిశలా వ్యాపించింది. తెలంగాణలో కరెంటు కోతలు, పవర్ హాలిడేలకు శాశ్వత ముగింపునిచ్చి, ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్ర సృష్టించారు అని హరీశ్రావు తెలిపారు.
తెలంగాణ ఆవిర్భవించిన నాడు రాష్ట్రంలో స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 7,778 మెగావాట్లు మాత్రమే అని మంత్రి గుర్తు చేశారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో జరిగిన అద్భుతమైన కృషివల్ల నేడు తెలంగాణ స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 18,453 మెగావాట్లకు పెరిగింది. తెలంగాణ ఏర్పడిన తరువాత విద్యుత్తురంగ బలోపేతం కోసం, కరెంటు సరఫరా, పంపిణీ వ్యవస్థలను మెరుగుపర్చడం కోసం ప్రభుత్వం 38 వేల 70 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది అని మంత్రి స్పష్టం చేశారు.
ప్రత్యామ్నాయ ఇంధన వనరుల ద్వారా విద్యుదుత్పత్తి చేయడంలోనూ తెలంగాణ అగ్రగామిగా నిలుస్తున్నది అని మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. రాష్ట్రం ఏర్పడిననాడు సోలార్ పవర్ కేవలం 74 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి అయ్యేది అని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యల వల్ల నేడు రాష్ట్రంలో 5,741 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి జరుగుతున్నది అని తెలిపారు.
తలసరి విద్యుత్తు వినియోగం సైతం ఒక ప్రధాన ప్రగతి సూచిక అని పేర్కొన్నారు. 2014-15లో తెలంగాణలో తలసరి విద్యుత్తు వినియోగం 1,356 యూనిట్లు మాత్రమే ఉండేది. 2021-22 నాటికి అది 2,126 యూనిట్లకు పెరిగింది. ఇదే సమయంలో జాతీయ సగటును గనుక పరిశీలిస్తే 1,255 యూనిట్లుగా ఉన్నది. అంటే తెలంగాణ తలసరి విద్యుత్తు వినియోగం, జాతీయ తలసరి వినియోగంకన్నా 69 శాతం ఎక్కువగా నమోదవడం మనకు గర్వకారణం. విద్యుత్ శాఖ కోసం ఈ బడ్జెట్ లో రూ.12,727 కోట్లు ప్రతిపాదించడమైనది అని హరీశ్రావు పేర్కొన్నారు.