యాదగిరిగుట్ట: రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం రేపు మూతపడనుంది. శనివారం అర్ధరాత్రి చంద్రగ్రహణం ఉండటంతో సాయంత్రం 4 గంటల నుంచి 29వ తేదీ ఉదయం 5 గంటల వరకు దేవాలయాన్ని మూసివేస్తున్నట్లు యాదాద్రి ఆలయ ఈవో తెలిపారు. చంద్రగ్రహణానికి ముందు రోజైన శుక్రవారం రాత్రి 7 గంటలకు శరత్ పౌర్ణమి వేడుకలను నిర్వహిస్తామని చెప్పారు. ఈ వేడుకలు బ్రహ్మోత్సవ కల్యాణ మండపంలో జరుగనున్నాయని వెల్లడించారు.
చంద్రగ్రహణం సందర్భంగా శనివారం సాయంత్రం 4 గంటలకు ఆలయాన్ని మూసివేయనున్నారు. సంప్రోక్షణ అనంతరం ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు తెరవనున్నారు. ప్రధాన ఆలయంతోపాటు అనుబంధ ఆలయాలు అయిన శ్రీ పర్వతవర్దిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయం, పాతగుట్ట నరసింహస్వామి ఆలయం కూడా మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. శనివారం అర్ధరాత్రి 1.06గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. 2.22 గంటలకు గ్రహణం ముగియనుంది.
పాక్షిక చంద్రగ్రహణం కారణంగా శనివారం తిరుమలలోని శ్రీవారి ఆలయంతోపాటు టీటీడీ అనుబంధ ఆలయాలను మూసివేస్తారు. తిరిగి మరుసటిరోజైన ఆదివారం ఉదయం ఆలయాల తలుపులు తెరుస్తారు. ఆదివారం అర్ధర్రాతి దాటాక 1.05 నుంచి 2.22 గంటల వరకు ఈ పాక్షిక చంద్రగ్రహణం ఉంటుంది. గ్రహణ సమయానికి 6 గంటలు ముందుగా శ్రీవారి ఆలయ తలుపులు మూసివేయడం ఆనవాయితీ. తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో శనివారం సాయంత్రం 5 గంటలకు తలుపులు మూసివేస్తారు. తిరిగి ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకు తలుపులు తెరుస్తారు.
శుద్ధి అనంతరం ఉదయం 7 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి, శ్రీ కోదండ రామస్వామి, శ్రీనివాస మంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో శనివారం రాత్రి 7 గంటలకు తలుపులు మూసివేసి, తెల్లవారుజామున 4.30 గంటలకు తెరిచి, శుద్ధి అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. గ్రహణం కారణంగా శ్రీ కోదండ రామస్వామివారి ఆలయంలో పౌర్ణమి అష్టోత్తర శతకలశాభిషేకం, శ్రీనివాస మంగాపురంలో పౌర్ణమి గరుడ సేవ రద్దయ్యాయి. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయంలో శనివారం అన్నాభిషేకం జరుగుతుంది. గ్రహణం కారణంగా సాయంత్రం 6.45 గంటలకు ఆలయ తలుపులు మూసివేసి, మరునాడు ఉదయం 4 గంటలకు తలుపులు తెరిచి శుద్ధి అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.