యాదాద్రి భువనగిరి : తెలంగాణ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవానికి చిహ్నంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి దేవస్థానం డిసెంబర్లో ప్రారంభోత్సవం కానున్నట్లు సమాచారం. రానున్న ఆరు నెలల్లో యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం పనులు పూర్తి చేయడానికి ప్రభుత్వం సంకల్పించింది. ఈ నేపథ్యంలో డిసెంబర్లో దేవస్థానం ప్రారంభోత్సవం జరగనున్నట్లు తెలుస్తోంది. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణానికి ఇప్పటివరకు మొత్తం రూ. 1000 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. మిగతా పనులు పూర్తయ్యేవరకు మరో రూ. 200 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా.
ఆలయానికి వారాంతాల్లో ఇప్పటికే సందర్శకుల సంఖ్య రోజుకు 60 వేలకు పైగా ఉంటుంది. ఒక్కసారి ఆలయం ప్రారంభమైతే యాదగిరిగుట్టకు జనం పోటెత్తనున్నారు. ప్రారంభమైన ఏడాదిలోపే యాదాద్రిలో భక్తులు తిరుమలలో వలె క్యూ కట్టనున్నారు. ఇది ఊహించిన ప్రభుత్వం ప్రభుత్వం యాదాద్రి భక్తుల ప్రసాద అవసరాల కోసం ఇప్పటికే ఆటోమాటిక్ లడ్డూ మిషన్లను కొనుగోలు చేసింది. ఈ ఆటోమాటిక్ మిషన్ రోజుకు 3 లక్షల లడ్డూలు తయారు చేసే సామర్థ్యం కలిగిఉంది.