హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా భక్తుల సౌకర్యార్థం అదనంగా 250 కాటేజీలు నిర్మించాలని అధికారులు భావించగా, వీటి నిర్మాణానికి దాతల నుంచి విశేష స్పందన లభించింది. ఇప్పటికే సరిపడా నిధులు సమకూరినట్టు అధికారులు తెలిపారు. 250 కాటేజీలకు గాను తొలిదశలో 50 కాటేజీల పనులను నాలుగైదు రోజుల్లో ప్రారంభించనున్నారు. దేవస్థానం సమీపంలోని టెంపుల్ సిటీ వద్ద ప్రభుత్వం 850 ఎకరాల భూమిని సమకూర్చిన విషయం తెల్సిందే. ఇందులో 250 ఎకరాలను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దడంతోపాటు 250 ప్లాట్లను కూడా చేశారు. ఇక్కడ నిర్మించే కాటేజీల డిజైన్లను ఢిల్లీకి చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ సంస్థ ఆర్ కాప్ రూపొందించింది. ఒక్కో కాటేజీ నిర్మాణానికి రూ.రెండు కోట్లు వెచ్చించనున్నారు. తిరుమలలో మాదిరిగానే ఇక్కడా నిర్మించనున్నారు.
పోటెత్తుతున్న భక్తులు..
ఆలయ పునః ప్రారంభం తరువాత భక్తుల తాకిడి పెరిగింది. ప్రస్తుతం రోజుకు సగటున 50 వేలమంది భక్తులు వస్తున్నారు. ఇప్పటికే గుట్టలో సుమారు 400 గదులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం ప్రెసిడెన్షియల్ సూట్ సహా 15 కాటేజీలను అధునాతన సౌకర్యాలతో అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిని గత ఏడాదే సీఎం కేసీఆర్ ప్రారంభించిన విషయం తెల్సిందే. ఇవి కాకుండా టెంపుల్ సిటీలో 250 కాటేజీలు కొత్తగా అందుబాటులోకి వస్తాయి. భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా కాటేజీలను యుద్ధ ప్రాతిపదికన నిర్మించాలని అధికారులు భావిస్తున్నారు. కాటేజీలతోపాటు వైటీడీఏ ఆధ్వర్యంలో ఫలహారశాల, టూరిజం శాఖ ఆధ్వర్యంలో కొండ కింద హరితహోటల్ నిర్మించనున్నారు. గండి చెరువు వద్ద బ్యూటిఫికేషన్ పనులు చేపట్టనున్నారు. కాగా భక్తుల నిత్యాన్నదానం కోసం నిర్మిస్తున్న సత్రాన్ని జూన్లో ప్రారంభించాలని నిర్ణయించారు. రూ.12 కోట్లకుపైగా వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సత్రం పనులు తుదిదశకు చేరినట్టు అధికారులు తెలిపారు.