ఇరిగేషన్ శాఖపై 40 పేజీల వైట్ పేపరా.?
దీన్ని బట్టే సర్కారు ఉద్దేశం బయటపడింది
గత సర్కారుపై బురదజల్లడం తప్ప.. వాస్తవాలు చెప్పే ఉద్దేశం సర్కారుకు లేదు
Y Satish Reddy | హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం వైట్ పేపర్ అంటే అర్థాన్నే పూర్తిగా మార్చేసింది.. శ్వేతపత్రాన్ని నల్లపత్రంగా, పూర్తిగా అబద్ధాల పత్రంగా, తమకు నచ్చిన అంశాలు చెప్పుకునే ఓ రఫ్ పేపర్ గా మార్చేసింది అని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీష్ రెడ్డి మండిపడ్డారు. ఇరిగేషన్ శాఖపై వైట్ పేపర్ ఇవ్వడం అంటే.. రాష్ట్రంలోని భారీ ప్రాజెక్టుల నుంచి చిన్నతరహా నీటి వనరుల దాకా అన్ని వివరాలు ఉండాలి. ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి.?. వాటి సామర్థ్యం, వాటి ద్వారా అందుతున్న సాగునీరు.? గతంలో ప్రాజెక్టుల పరిస్థితి..? ప్రస్తుత పరిస్థితి… ఎన్ని చెరువులను పునరుద్ధరించారు.? వాటి ద్వారా వచ్చిన ఫలితం ఏంటనేది కూడా శ్వేతపత్రంలో ఉండాలన్నారు.
సాగు విస్తీర్ణం ఎక్కడి నుంచి ఎక్కడికి పెరిగింది..? పంటల ఉత్పత్తి ఎన్ని టన్నుల నుంచి ఎన్ని టన్నులకు పెరిగింది.? ఒకప్పుడు మంచినీటి సరఫరా ఎలా ఉండేది.? ఇప్పుడు మంచినీరు ఎలా అందుతోంది.? పరిశ్రమలకు నీటి వసతి ఎలా ఉంది.? దీని కోసం చేసిన ఖర్చు ఎంత.? నీరు అందడం వల్ల పెరిగిన స్థూల ఉత్పత్తి ఎంత.? అనే వివరాలు పొందుపరచాలి.
2014లో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం కోటి 31 లక్షల ఎకరాలు. 2023కు వచ్చే సరికి అది రెండు కోట్ల20 లక్షల ఎకరాలకు పెరిగింది. కేవలం 9 ఏళ్లలో దాదాపుగా రెట్టిపు అయ్యింది. 2014లో 68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండితే.. 2023లో అది 2.7 కోట్ల మెట్రిక్ టన్నులకు పెరిగింది. ఇలా పెరిగిన పరిశ్రమలు, వాటిలో పెరిగిన ఉత్పత్తి.. పెరిగిన పంటల విలువ, వాటి వలన పెరిగిన రాష్ట్ర స్థూల ఉత్పత్తి.. ఇలా అన్ని లెక్కలు వైట్ పేపర్లో ఉండాలి అని సతీష్ రెడ్డి అన్నారు.
కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వైట్ పేపర్ కి అర్థం తెలిసినట్టు లేదు. కేవలం కొన్ని పేజీలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేసుకొచ్చి ఇదే నీటి పారుదల శాఖపై శ్వేతపత్రం అని చెప్పడాన్ని బట్టి కాంగ్రెస్ సర్కారు ఉద్దేశం, దురుద్దేశం ఏంటో కూడా స్పష్టమౌతోంది. అసెంబ్లీలో చర్చ సందర్భంగా కూడా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతుంటే మంత్రులు పదే పదే అడ్డుకోవడాన్ని బట్టి.. సర్కారు కేవలం గత ప్రభుత్వంపై బురదజల్లే ఉద్దేశంతోనే శ్వేతపత్రాన్ని అడ్డుపెట్టుకుని డ్రామా చేస్తోందనే విషయం స్పష్టమైంది. 2014కు ముందు రాష్ట్రంలో నీటి వసతి, ప్రాజెక్టుల పరిస్థితి, ప్రస్తుతం ప్రాజెక్టుల పరిస్థితి, భూగర్భజలాలు, పండుతున్న పంటల వివరాలు చెప్పేందుకు ప్రయత్నించిన హరీష్ రావు గారిని పదే పదే అడ్డుకుని సభాసమయాన్ని వృథా చేశారు. అంటే.. రాష్ట్ర ప్రజలకు సర్కారు తాము చెప్పింది మాత్రమే ప్రజల్లోకి వెళ్లాలి గానీ.. వాస్తవాలు ఏంటో తెలియకూడదనే దుర్మార్గపూరితమైన ఆలోచనతోనే ఇదంతా చేస్తున్నదని స్పష్టమైంది. అందుకే ఇది వైట్ పేపర్ కాదు.. బీఆర్ఎస్ సర్కారుపై బురద జల్లేందుకు రూపొందించిన బురద పేపర్. ఓ చిత్తుపేపర్ అని వై సతీష్ రెడ్డి విమర్శించారు.