దావోస్లో మంత్రి కేటీఆర్ ప్రజెంటేషన్తో తెలంగాణపై ఆసక్తి
దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్గా జాతీయ పార్టీ ప్రకటన
హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన.. ఢిల్లీలో రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది. బీజేపీ, కాంగ్రెస్ సహా ఇతర రాజకీయ పార్టీల్లోనూ అంతర్గతంగా సీఎం కేసీఆర్ గురించి తీవ్రంగా చర్చిస్తున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని విదేశీ రాయబార కార్యాలయాల దౌత్యవేత్తలు సైతం సీఎం కేసీఆర్పై దృష్టిపెట్టినట్టు తెలిసింది. ఇటీవలే ఢిల్లీలోని స్విట్జర్లాండ్, శ్రీలంక ప్రతినిధులు తమకు సన్నిహితంగా ఉన్న నేతలు, జర్నలిస్టుల వద్ద సీఎం కేసీఆర్ గురించి ఆరా తీసినట్టు విశ్వసనీయ సమాచారం. ‘ఎవరు ఈ సీఎం కేసీఆర్? ఆయన రాజకీయ ప్రస్థానం ఏమిటి?’ అని వివరాలు సేకరించారని తెలిసింది. తెలంగాణ రాష్ట్రం గురించి సైతం తెలుసుకున్నారని సమాచారం.
ఇటీవలే దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణలోని పెట్టుబడి అవకాశాలు, ప్రభుత్వ పాలసీలు, అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇది సదస్సులో హైలెట్గా నిలిచింది. అప్పటి నుంచే వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు తెలంగాణ గురించి ఆసక్తిగా వివరాలు సేకరిస్తున్నారని ఢిల్లీ వర్గాలు తెలిపాయి. తాజాగా సీఎం కేసీఆర్ ప్రకటనతో రాజకీయాల్లో ఏదో జరుగబోతున్నదనే కోణంలో ఆసక్తి పెరిగినట్టు పేర్కొన్నాయి. సాధారణంగా విదేశీ దౌత్యవేత్తలు రాజకీయాల్లో జరుగబోయే మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్త్తూ, తమ దేశ ప్రయోజనాలకు అనుగుణంగా సమాచారం సేకరిస్తుంటారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ గురించి వారు ఆరా తీయడం కూడా ఢిల్లీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.
బీజేపీ టార్గెట్ కేసీఆర్
జాతీయ పార్టీ ప్రకటనతో బీజేపీలో భయం మొదలైందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇందుకు తెలంగాణలో ఇటీవలి రాజకీయ పర్యటనలను ఉదహరిస్తున్నారు. కేవలం ఐదు నెలల వ్యవధిలోనే పీఎం మోదీ రెండుసార్లు, అమిత్ షా రెండు సార్లు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా రెండుసార్లు తెలంగాణలో పర్యటించారు. కేంద్ర మంత్రుల పర్యటనకు లెక్కే లేదు. రెండు రోజుల కిందట నిజామాబాద్లో జరిగిన గ్రామ స్థాయి కార్యక్రమానికి కూడా కేంద్ర మంత్రి హాజరయ్యారు. మోదీ సహా కీలక నేతలంతా నేరుగా సీఎం కేసీఆర్ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. వచ్చే నెలలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్లో నిర్వహించడానికి కూడా ఇదే భయం కారణమని అంటున్నారు. ఇక్కడే మోదీ బహిరంగ సభలో మాట్లాడనున్నారు. సాధారణంగా ఇలాంటి రాజకీయ పర్యటనలను, సమావేశాలను ఎన్నికలు జరిగే రాష్ర్టాల్లో నిర్వహిస్తుంటారు. వచ్చే ఏడాది గుజరాత్, కర్ణాటక ఎన్నికలు ఉన్నాయి. మరో ఏడాదిన్నర దాకా తెలంగాణలో ఎన్నికలు లేవు. అయినా బీజేపీ అగ్రనాయకత్వం మొత్తం.. 12 మంది పార్టీ ముఖ్యమంత్రులతో సహా హైదరాబాద్లో వాలడాన్ని బట్టి చూస్తే సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనతో బీజేపీ నేతల్లో ఎంత ఆందోళన ఉన్నదో అర్థమవుతున్నదని ఢిల్లీ పాత్రికేయుడొకరు అన్నారు.