హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): సంస్థకు, ఉద్యోగులకు మరింతగా మేలు చేసేందుకే సీఎం కేసీఆర్ టీఎస్ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయించారని సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. సంస్థ విలీన నిర్ణయం తర్వాత తొలిసారిగా గురువారం బస్భవన్కు వచ్చిన ఆయనకు సంస్థ ఉన్నతాధికారులు, ఉద్యోగులు ఘనస్వాగతం పలికి, కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ తాను చైర్మన్గా ఉన్న సమయంలోనే ఈ నిర్ణయం రావడం తనకెంతో సంతోషంగా ఉన్నదని తెలిపారు. 43 వేల మందికిపైగా ఆర్టీసీ కుటుంబం తరఫున సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఇక నుంచి ఉద్యోగులు, సిబ్బంది అందరికీ ఉద్యోగ భద్రత లభించిందని చెప్పారు. ఈ నిర్ణయం వెనక ప్రతి ఉద్యోగి కష్టం, కృషి ఉన్నదని తెలిపారు. సంస్థలో ఎన్నో వినూత్న కార్యక్రమాలను తీసుకొచ్చామని, తనతో పాటు ఎండీ సజ్జనార్ సంస్థ అభివృద్ధికి విశేష కృషి చేశారని చెప్పారు. భవిష్యత్తులోనూ బాధ్యతగా పనిచేసి సంస్థకు దేశంలోనే మంచిపేరు తేవాలని ఉద్యోగులు, సిబ్బందికి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ ఈడీలు మునిశేఖర్, పురుషోత్తం, వెంకటేశ్వర్లు, కృష్ణకాంత్, చీఫ్ మేనేజర్ విజయ్ కుమార్, సీఎంఈ రఘునాథరావు, సీటీఎం జీవన్ప్రసాద్, సీఎఫ్ఎం విజయపుష్ప, సీసీవోఎస్ విజయభాసర్ , సీసీఈ రాంప్రసాద్, బిజినెస్ హెడ్ సంతోష్కుమార్, రంగారెడ్డి, హైదరాబాద్, సికింద్రాబాద్ ఆర్ఎంలు శ్రీధర్, వరప్రసాద్, ఖుస్రోషా ఖాన్ తదితరులు పాల్గొన్నారు.