హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో మహిళా వారోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఇవి ఈ నెల 14 వరకు కొనసాగనున్నాయి. వారోత్సవాలను మంత్రి కేటీఆర్ బుధవారం తొర్రూరులో ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా స్వయం సహాయక మహిళా సంఘాలకు దాదాపు రూ.750 కోట్ల విలువైన రుణాల రాయితీ చెక్కులను పంపిణీ చేయనున్నారు. వారం రోజుల కార్యక్రమాల షెడ్యూల్ను మున్సిపల్ శాఖ ఆయా మున్సిపల్ కమిషనర్లకు పంపించింది. మహిళా వారోత్సవాల సందర్భంగా కీలకపాత్ర పోషించే పురపాలికల్లో వివిధ హోదాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళా ప్రజాప్రతినిధులు, పురపాలక శాఖ సిబ్బంది, స్వయం సహాయక సంఘాల సభ్యులు, పారిశుద్ధ్య కార్మికులు, వివిధ ఎన్జీవోల సిబ్బందితో మహిళా దినోత్సవ వారోత్సవాలను నిర్వహించేలా కార్యాచరణను రూపొందించారు. వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉన్నతాధికారులు, విభాగాధిపతులు, మహి ళా జిల్లా కలెక్టర్లు, పోలీస్ ఉన్నతాధికారులు, మహిళా జడ్జీలు తదితర ప్రముఖులను ముఖ్య, ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించనున్నారు. వారోత్సవాల్లో ప్రధానంగా క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు, మహిళలకు హెల్త్ క్యాంపులు, కంటివెలుగు శిబిరాలు, మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీ తదితర కార్యక్రమాలు చేపట్టనున్నారు. వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మహిళలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను సన్మానిస్తారు.