Congress | నమస్తే తెలంగాణ నెట్వర్క్: కాంగ్రెస్లో టికెట్ల పంచాయితీ సెగలు కొనసాగుతున్నాయి. మంచిర్యాల జిల్లా చెన్నూర్ కాంగ్రెస్ టికెట్ పంచాయతీ సెగలు ఏకంగా రాహుల్కే తాకాయి. తన పర్యటనలో భాగంగా వచ్చిన రాహుల్గాంధీ శుక్రవారం కరీంనగర్లోని ఓ హోటల్లో బస చేయగా, కాంగ్రెస్ చెన్నూర్ టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, డాక్టర్ రాజారమేశ్, నూకల రమేశ్, దుర్గం నరేశ్ తదితరులు హోటల్ ఎదుట ఆందోళనకు దిగారు. కొల్లాపూర్ టికెట్ ఆశించి భంగపడ్డ పీసీసీ సభ్యుడు చింతలపల్లి జగదీశ్వర్రావు కాంగ్రెస్కు రాజీనామా చేశారు. ఆ వెంటనే ఆల్ ఇండియా ఫార్వర్డ్బ్లాక్ పార్టీలో చేరగా, వెంటనే బీఫాం అందజేశారు. జగదీశ్వర్రావును బుజ్జగించి తనకు సంపూర్ణంగా మద్దతిచ్చేలా చేస్తుందని ఆశించిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ పరిణామంతో షాక్కు గురయ్యారు.
లైంగిక వేధింపుల కేసు ఎదుర్కొంటున్న నారాయణపేట డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్రెడ్డిని కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయాలంటూ శుక్రవారం గాంధీభవన్ ఎదుట మహిళలు ధర్నాకు దిగారు. ఆయనకు నారాయణపేట ఎమ్మెల్యే టికెట్ ఇస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఆయనకు టికెట్ ఇస్తున్నట్టు వస్తున్న వార్తలపై రేవంత్రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో కాంగ్రెస్ టికెట్ల పంచాయితీ పతాకస్థాయికి చేరింది. ఒకసారి కాంగ్రెస్ పార్టీని మోసం చేసి వెళ్లిన కోరం కనకయ్యకు ఇల్లందు టికెట్ ఇస్తే సహించేది లేదని పీసీసీ కార్యదర్శి రాంరెడ్డి గోపాల్రెడ్డి హెచ్చరించారు. ఇల్లెందులో శుక్రవారం నిర్వహించిన దివంగత నేత రాంరెడ్డి వెంకటరెడ్డి అనుచరుల ఆత్మీయ సమ్మేళనంలో గోపాల్రెడ్డి మాట్లాడుతూ.. కొందరు సొంత సర్వేలు చేయించుకుని తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారని మండిపడ్డడారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ‘కోరం కనకయ్య హఠావో.. కాంగ్రెస్ బచావో’ అం టూ నినదించారు. ఆయనకు టికెట్ ఇస్తే గ్రామాల్లోకి రానీయకుండా తరిమి కొడతామని హెచ్చిరించారు.