ఆదిలాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ జిల్లా ఇందూర్పల్లిలో మహిళలు ఆర్టీసీ బస్సును అడ్డుకున్నారు. సోమవారం భీంపూర్ మండలం కరంజి (టీ) నుంచి ఆదిలాబాద్కు వస్తున్న బస్సు ఎక్కడానికి మహిళలు, స్థానికులు ప్రయత్నించారు. అయితే.. ఇందూర్పల్లిలో మహిళలు ఎక్కువగా ఉండటంతో డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోయారు.
డ్రైవర్ నిర్లక్ష్యాన్ని గమనించిన మహిళలు తిరుగు ప్రయాణంలో బస్సును అడ్డుకున్నారు. తాము పనుల కోసం ఆదిలాబాద్కు పోదామనుకుంటే బస్సు ఎందుకు ఆపలేదని నిలదీశారు. ఆదిలాబాద్ డీఎంకు ఫిర్యాదు చేస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ప్రయాణికులు ఉన్న విషయాన్ని గమనించలేదని డ్రైవర్ స్థానికులకు క్షమాపణలు చెప్పి.. ఇక నుంచి ఇక్కడ బస్సు ఆపుతామని తెలుపడంతో వారు శాంతించారు.